Clash Between Punganur TDP Activits: పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ నియామక అంశం తిరుపతిలో ఉద్రిక్తతలకు దారితీసింది. హోటల్ గ్రాండ్ రీచ్లో ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరగాల్సిన సమావేశానికి ముందే రెండు వర్గాల కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగారు. ఇన్ఛార్జ్ చల్లా బాబు వర్గం, ఇతర స్థానిక నేతల అనుచరుల మధ్య జరిగిన తోపులాటలో కొందరు గాయపడ్డారు. ఘటనను చిత్రీకరిస్తున్న వారిపై కొందరు కార్యకర్తలు దాడికి యత్నించినట్లు సమాచారం. అయితే, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమావేశాన్ని రద్దు చేసి, ఇతర నాయకులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆయన ఘర్షణల్లో గాయపడిన కార్యకర్తను పరామర్శించారు.
ఇదిలా ఉండగా, తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నియామకంపై అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని, బలప్రదర్శనలకు తావులేదని నేతలు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని వారు పిలుపునిచ్చారు. అయితే, పుంగనూరు టీడీపీలో వర్గపోరు.. తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.. ఇన్ఛార్జ్ నియామకంపై టీడీపీ సమావేశం ఆరంభంలోనే ఇరు వర్గాలు కొట్టుకోవంతో.. మధ్యలోనే సమావేశం రద్దు చేయాల్సిన పరిస్థితి రావడం చర్చగా మారింది..

