Road Accident: తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లి సమీపంలోని కడప-చెన్నై జాతీయ రహదారిపై లారీ – ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఏడాది వయసున్న ‘యస్విత’ అనే చిన్నారి మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప డిపోకు చెందిన నాన్స్టాప్ ఆర్టీసీ బస్సు తిరుపతి వైపు నుంచి కడపకు వెళ్తోంది. ఈ క్రమంలో ఉడుంవారిపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ అత్యంత వేగంగా బస్సును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో తీవ్రమైన శబ్దం రావడంతో స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా దెబ్బతిన్న బస్సు శిథిలాల నుంచి క్షతగాత్రులను బయటకు తీశారు.
ఈ ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 30 మంది బాధితులను చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు స్టార్ట్ చేశారు. ఈ ఘోర ప్రమాదంతో కడప-చెన్నై హైవేపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు వెల్లడించారు.

