తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రకృతి ఒక అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించింది. సాధారణంగా వేసవి కాలంలో ఎండ వేడిమితో అల్లాడిపోయే భక్తులకు, శ్రీవారి సన్నిధిలో అనూహ్యంగా మారిన వాతావరణం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోంది. మార్చి నెలలో మండుటెండలు ఉండాల్సిన సమయంలో, తిరుమల కొండలను దట్టమైన మంచు కమ్మేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
శ్రీవారి ఆలయ పరిసరాల నుంచి మొదలుకొని కొండపైకి వచ్చే ఘాట్ రోడ్డు మార్గం వరకు అంతా మంచుమయంగా మారిపోయింది. ఈ అద్భుత వాతావరణం కారణంగా తిరుమల గిరులు శ్వేత వర్ణాన్ని పులుముకున్నట్లుగా కనిపిస్తున్నాయి. దట్టంగా కురుస్తున్న మంచు వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కూడా సరిగ్గా కనిపించనంతగా పొగమంచు అలుముకుంది. వేసవిలోనూ శీతాకాలాన్ని తలపించేలా ఉన్న ఈ వాతావరణం భక్తులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది.
తిరుమల మాడ వీధులు, ఆలయ గోపురం , పరిసర ప్రాంతాలు మంచు మేఘాల చాటున దాగి ఉండటంతో భక్తులు పరవశించిపోతున్నారు. కొండపైకి కాలినడకన వచ్చే భక్తులతో పాటు, వాహనాల్లో వచ్చే వారు కూడా ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఫొటోలు తీసుకుంటున్నారు. సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రమే కనిపించే ఈ దృశ్యాలు ఇప్పుడు మార్చి నెలలో కనిపించడం ఒక విశేషంగా నిలిచింది.
Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే 4గురు మృతి..
