Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఆర్జిత సేవా టికెట్లకు రేపటి నుంచే రిజిస్ట్రేషన్!

  • తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్
  • అక్టోబర్‌ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు రేపటి నుంచి విడుదల
Tirumala

Tirumala

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. అక్టోబర్‌ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను రేపటి(ఈ నెల 18) నుంచి విడుదల చేయనుంది. రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. రేపు ఉదయం 10 గంటల నుంచి 20 వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్‌ ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించనుంది టీటీడీ.

Read Also: Janasena: రేపట్నుంచి జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం

22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు, వాటి దర్శన స్లాట్లు తితిదే విడుదల చేయనుంది. 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు , మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగులు దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటా విడుదల చేస్తామని టీటీడీ పేర్కొంది.

ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవా జనరల్‌ కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవ కోటాను విడుదల చెయ్యనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్‌ చేసుకోవాలని దేవస్థానం కోరింది. ఇదిలా ఉండగా.. అక్టోబర్‌ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.