Tirumala: తొలి ఏకాదశి, శనివారం ఒకే రోజు కలిసి రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీనితో భక్తులు బయట ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు ముందస్తు ప్రణాళికతో తిరుమలకు రావాలని అధికారులు తెలిపారు.
శుక్రవారం నాడు మొత్తం 78,721 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 38,018 మంది తలనీలాలు సమర్పించారు. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.98 కోట్లుగా నమోదైంది. ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారి పుష్కరిణిని ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి 31 వరకు పుష్కరిణిలో మరమ్మతుల పనులు చేపట్టనున్నారు. అనంతరం సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా ముందస్తు చర్యల కోసం పుష్కరిణిని మూసివేయనున్నారు. దీంతో మొత్తం 40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో హారతి కార్యక్రమం నిలిపివేయబడుతుంది.

