NTV Telugu Site icon

Tirupati Laddu Controversy: దూకుడు పెంచిన సిట్.. నేడు లడ్డూ పోటు ఉద్యోగుల విచారణ..

Sit

Sit

Tirupati Laddu Controversy: శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న జరిగిందన్న ఆరోపణలపై నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో పడిన సిట్.. వేగంగా దర్యాప్తు చేస్తోంది. నిన్న మూడోరోజు.. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పిండిమరతో పాటు ల్యాబ్‌లో సిట్ టీమ్ తనిఖీలు చేసింది. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి సరుకులను నిల్వ చేసే గోదాములను పరిశీలించింది. గోడౌన్‌లలో నిల్వఉంచిన ముడిసరుకుల నాణ్యతను సిట్ చెక్ చేసింది. ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడిసరుకును ఎలా భద్రపరుస్తారు.. వాటికి సంబంధించిన రికార్డులను ఎలా మెయిన్‌టేన్ చేస్తారు.. అనే అంశాలపై సిట్ ఆరా తీసింది. సుమారు 7 గంటల పాటు మార్కెటింగ్ గోడౌన్‌లో అధికారులు తనిఖీలు చేశారు. ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతను తిరుమలలో పరీక్షించేందుకు మెషీన్లు ఉన్నాయా, ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారని టెక్నికల్ టీంను అడిగి తెలుసుకున్నారు.

Read Also: Jammu And Kashmir Polls: తుది దశ పోలింగ్‌ ప్రారంభం.. 40 స్థానాలకు 415 మంది అభ్యర్థులు పోటీ!

అలాగే.. లడ్డూ ప్రసాదాల తయారీలో వినియోగించే నెయ్యి శాంపిల్స్‌ను ఎలా టెస్ట్‌ చేస్తారనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. తిరుమలకు వచ్చిన నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్స్‌ను కూడా సిట్ సేకరించింది. టెస్టుల రిపోర్టులు రావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది.. టెస్ట్‌ రిపోర్ట్‌లను ఎలా కలెక్ట్‌ చేస్తారు.. ఎలా రికార్డ్ చేస్తారనే అంశాలను సిట్ పరిశీలించింది. ఇక ఇవాళ ట్యాంకర్లు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు నెయ్యి నిల్వ చేస్తారు.. ప్రసాదాల తయారీకి ఎలా తరలిస్తారు.. లడ్డూ తయారీ ఎలా ఉంటుంది.. తయారైన లడ్డూలను ఎలా కౌంటర్లకు తరలిస్తారనే అంశాలపై సిట్ దృష్టిపెట్టనుంది. లడ్డూ పోటులో పనిచేసే సిబ్బందిని ప్రశ్నించి.. లడ్డూ తయారీ నుంచి.. విక్రయాల విక్రయాల వరకు ఉండే ప్రాసెస్‌ను ఇవాళ పరిశీస్తారు. కాగా, నిన్న సుప్రీంకోర్టులో లడ్డూ వ్యవహారంపై విచారణ సాగగా.. లడ్డూకు వాడిన నెయ్యి రిపోర్ట్‌పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సెప్టెంబర్ 18నాటి సీఎం ప్రకటనకు ఆధారం ఉందా అని ధర్మాసనం నిలదీసింది. కోట్లాది భక్తుల మనోభావాలతో కూడిన అంశమన్న న్యాయస్థానం.. ఇరువైపులా వాదనలు రికార్డ్‌ చేసి తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసిన క్రమంలో వైసీపీ నేతలు అధికార పక్షంపై ఘాటుగా స్పందించిన విషయం విదితమే.