Tollywood: సమస్య సృష్టించి పరిష్కరించినట్లు బిల్డప్ రాజకీయాలు: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల

ఏపీ సీఎం జగన్‌తో టాలీవుడ్ ప్రముఖుల సమావేశంపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు చేశారు. సమస్యను ఉద్దేశపూర్వకంగా సృష్టించి, మ‌ళ్లీ ఆ సమస్యను పరిష్కరించినట్లు సీఎం జగన్ బిల్డప్ రాజకీయాలు చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. అసలు ఎవరు సినిమా టిక్కెట్ రేట్లు తగ్గించమన్నారు? ఎవరు పెంచమన్నారు వైఎస్ జగన్? మీరే సమస్యను సృష్టించి మీరే పరిష్కరించినట్లు డైవర్షన్ పాలిట్రిక్స్ చేయడం మీకే చెల్లింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం’ అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. ఈ మేరకు #FailedCMjagan, #JaganMarkDiversionPolitics అంటూ హ్యాష్‌ట్యాగ్‌లను పోస్ట్ చేశారు.

కాగా గురువారం నాడు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో హీరోలు మహేష్‌బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నటులు అలీ, పోసాని కృష్ణమురళి కలిసి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలపై పలు రకాల విజ్ఞప్తులను ఏపీ ప్రభుత్వానికి అందజేశారు. వారం లేదా పదిరోజుల్లోనే ఏపీలో టిక్కెట్ రేట్ల అంశంపై శుభవార్త అందుతుందని టాలీవుడ్ ప్రముఖులు వెల్లడించారు.