Nellore: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేయర్ పొట్లూరి స్రవంతి రాజీనామాను జిల్లా కలెక్టర్ అధికారికంగా ఆమోదించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తన లేఖను ప్రతినిధి ద్వారా మేయర్ రాజీనామా లేఖను అందజేయగా, అదే రోజు రాత్రి కలెక్టర్ ఆమోదం తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మేయర్ పదవి ఖాళీ కావడంతో ఇంచార్జ్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసే వరకు ఆయన ఇంఛార్జ్ మేయర్గా కొనసాగనున్నారు. మరోవైపు, క్యాంపు రాజకీయాల్లో భాగంగా పలువురు కార్పొరేటర్లు ప్రస్తుతం గోవాలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త మేయర్ ఎన్నిక రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువడిన తర్వాత జరగనుంది.
Read Also: Republic Day: ఈసారి రిపబ్లిక్ డేకు అతిథులుగా వచ్చేదెవరంటే..! భారత్ ఆహ్వానించింది వీళ్లనే!
అయితే, గంట గంటకు మారుతున్న నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం క్లైమాక్స్కు చేరింది. ఈనెల 18న మేయర్ స్రవంతి పై అవిశ్వాస తీర్మానానికి కౌన్సిల్ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. కార్పొరేటర్లు పార్టీలు మారుతూ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చారు. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కార్పొరేటర్లలో ఐదుగురిని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేర్చారు. దీంతో అప్రమత్తమైన తెలుగుదేశం పార్టీ.. అధికారాన్ని ఉపయోగించింది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ.. వైసీపీకి ఉన్న కార్పొరేటర్ లను ఒక్కొక్కరిని పార్టీలోకి చేర్చుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో సిటీ నియోజకవర్గంలో మైనార్టీ కార్పొరేటర్ కరిముల్లా మంత్రి నారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. అది జరిగిన మూడు గంటల్లోనే.. వైసీపీ నగర అధ్యక్షుడు, 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఆ పార్టీకి షాక్ ఇచ్చి.. సైకిల్ ఎక్కారు.
54 స్థానాలు కలిగిన నెల్లూరు కార్పొరేషన్ లో.. 41 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు. అవిశ్వాసం నెగ్గి మెజారిటీ టీడీపీకి ఉండగా.. వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నట్లు ఆ పార్టీ చెబుతోంది. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కార్పొరేటర్లను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. శ్రీకాళహస్తి తో పాటు తిరుమల, గోవా పాండిచ్చేరి వంటి ప్రాంతాలకు క్యాంపులకు తీసుకెళ్లారని టిడిపిలో చర్చ జరుగుతోంది. వైసీపీలో ఉన్న 11 మందిని కూడా లాగేస్తామని అధికార పార్టీ ప్రచారం చేస్తున్న వేళ.. నెల్లూరు నగర మేయర్ స్రవంతి అధికార పార్టీకి షాక్ ఇచ్చింది.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించింది.. 2021 నవంబర్ 24న మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన స్రవంతి.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తప్పడుగులు వేశారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినా అవి సఫలీకృతం కాలేదు. దీంతో ఆమె రెండు పార్టీలకు దూరంగా ఉంటూ వచ్చారు.. ఈ క్రమంలో నవంబర్ 24న ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు 40 మంది కార్పొరేటర్లు సంతకాలు చేశారు. 25వ తేదీన వారందరూ జిల్లా కలెక్టర్ ను కలిసి నోటీసు అందజేశారు. అదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. తమ పార్టీకి మేయర్ కి సంబంధం లేదని.. ఆమె ఎప్పుడో వైసీపీకి రాజీనామా చేశారని వెల్లడించారు. దీంతో మేయర్ స్రవంతికి మద్దతు ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు.. ఇప్పుడు ఆమె రాజీనామా చేయడం.. ఆ రాజీనామాకు కలెక్టర్ ఆమోదం తెలపడం జరిగిపోయాయి..