CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకారుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మత్స్యకారుల కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. “ఉవ్వెత్తున ఎగిసిపడే అలలకు ఎదురెళ్లాలంటే గుండె ధైర్యం కావాలి.. అది మత్స్యకారుల సొంతం” అని చంద్రబాబు పేర్కొన్నారు. వేట నిషేధిత కాలంలో మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 37 వేల మంది మత్స్యకారుల ఖాతాల్లో నగదు బదిలీ చేసినట్లు వెల్లడించారు. గతంలో కంటే ఈసారి మరింత ఎక్కువ మందికి ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు.

మత్స్యకారుల అభివృద్ధి కోసం సముద్ర సంపదను సమర్థంగా వినియోగిస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు.. వ్యవసాయం తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా ఆధారపడే రంగం మత్స్య సంపదేనని పేర్కొన్నారు. మెకనైజ్డ్ బోట్లకు డీజిల్ సబ్సిడీ అందిస్తున్నామని, ఇప్పటివరకు రూ.50 కోట్ల వరకు సబ్సిడీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. “తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. అందులో రాజీ లేదు.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం” అంటూ చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రాల బోట్లు తీరంలోకి వస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. శాటిలైట్ సాంకేతికత ద్వారా ఇతర రాష్ట్రాల బోట్లు వచ్చిన వెంటనే కలెక్టర్లకు సమాచారం అందే విధంగా వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు.

మత్స్యకారుల కోసం మరో 200 మెకనైజ్డ్ బోట్లు మంజూరు చేస్తామని, వాటికి రాయితీలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఏపీ కోస్తా తీరాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తామని, మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామని అన్నారు సీఎం చంద్రబాబు.. ఇక, సీ ఫుడ్‌లో అధిక ప్రోటీన్ ఉంటుందని, సమతుల ఆహారంగా అది ఎంతో ఉపయోగకరమని సీఎం పేర్కొన్నారు. “నేను కూడా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటా” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. మత్స్యకారులకు మార్కెట్ మేనేజర్‌లా పనిచేస్తానని, సీ ఫుడ్‌కు మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తానని చెప్పారు.

కోస్తా తీరంలో మరిన్ని ఫిషింగ్ హార్బర్లు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల కోసం పోర్టుల నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ పోర్టుల నిర్మాణం ద్వారా మత్స్యకారుల్లో నిరుద్యోగ సమస్య తగ్గి, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో నీటితో పాటు చేపలు కూడా ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. మత్స్యకారులకు GPS సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది తమ ప్రభుత్వమేనని చెప్పారు. చేపలు ఎక్కువగా లభించే ప్రాంతాలను GPS ద్వారా గుర్తించే సాంకేతికత మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు. అక్రమ వేటపై కూడా నిఘా ఉంచుతున్నామని వెల్లడించారు.

ఆక్వా రంగానికి ప్రభుత్వం భారీ స్థాయిలో ఆర్థిక సహాయం అందిస్తోందని సీఎం పేర్కొన్నారు. గత ఏడాది రూ.803 కోట్ల సబ్సిడీ ఇస్తే, ఈసారి రూ.843 కోట్ల సబ్సిడీ అందించినట్లు తెలిపారు. దేశంలోని మొత్తం ఆక్వా ఎగుమతుల్లో 80 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతున్నాయని చెప్పారు. మత్స్యకారులను ఆదుకోవడంలో కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో తాను మరియు పవన్‌ కల్యాణ్‌ కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.