Site icon NTV Telugu

Sankranti Rush: కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ.. బస్సులు, రైల్వే స్టేషన్లలో కిక్కిరిసిన జనం

Vja

Vja

Sankranti Rush: సంక్రాంతి పండుగ కోసం పట్టణాలు, నగరాల్లో ఉండే ప్రజలు తమ సొంతూళ్లకు పయనం అవుతున్నారు. విద్యా సంస్థలకు కూడా సెలవులు ఇవ్వడంతో కుటుంబ సమేతంగా ఊర్లకు ప్రయాణమయ్యారు. ఇలా ఊళ్లకు వెళ్తున్న వారిని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు నిలువుదోపిడీ చేస్తున్నాయి. వెళ్లే వారి రద్ధీకి తగ్గట్లుగానే ఆర్టీసీ బస్సులు, రైళ్లు లేకపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ వెహికిల్స్ ను ఆశ్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లోనే అధిక ధరలు వసూలు చేసే ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ భారీగా పెరిగిపోయింది. ఆర్టీసీ బస్సులు ఏ మూలకూ సరిపోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

Read Also: Harmanpreet Kaur: అదే మా అసలైన బలం.. ముంబై విజయంపై హర్మన్‌ప్రీత్ ఆనందం!

దీంతో పండుగ సెలవుల్లో విశాఖ, విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, బెంగళూరు, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లే వారు ప్రైవేట్ వెహికిల్స్ ను ఆశ్రయిస్తున్నారు. దీనిని సొమ్ము చేసుకోవడానికి ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు టికెట్ ధరలను భారీగా పెంచేశారు. ఈ క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని అరికట్టడానికి, ఫిట్ నెస్ లేని బస్సులు కూడా రోడ్డు మీదకు వచ్చేశాయి. పండుగకు ఆంధ్రాకు వెళ్లే వారు లక్షల్లో ఉండడంతో దాదాపుగా హైదరాబాద్ నగరం చాలా వరకు ఖాళీ అయింది. రద్దీకి తగ్గట్లుగా బస్సులు నడపడంలో ఆర్టీసీ అధికారులు విఫలం అయ్యారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని దోపిడీని కొనసాగిస్తూ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాలా మారిపోయిందని విమర్శిస్తున్నారు.

Read Also: Commander Manoj Katiyar: పాకిస్థాన్ ఖయ్యానికి కాలు దువ్వుతోంది.. లెఫ్టినెంట్ జనరల్ భారీ హెచ్చరిక..

ఇక, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇంతలా ప్రయాణికులను దోచేస్తుంటే ఆర్టీవో, రవాణా శాఖ అధికారులు తూ తూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారని ప్యాసింజర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ సందర్భంగా అధికారులు తనిఖీలు చేసే ఛాన్స్ ఉంటుందని ముందుగానే ట్రావెల్స్ యాజమాన్యాలు మాత్రం దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. హైవేలను వదిలేసి ఇతర మార్గాల ద్వారా వెహికిల్స్ నడిపిస్తున్నారు. దీంతో అధికారుల తనిఖీల్లో కొందరు అక్రమార్కులు మాత్రమే పట్టుబడుతున్నారు.

మరోవైపు, విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో సంక్రాంతి రద్దీ కొనసాగుతుంది. ప్రయాణీకులతో బస్టాండ్ కిటకిటలాడుతుంది. విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, భీమవరం వైపు వెళ్ళే ఫ్లాట్ ఫాంల వద్ద బస్సుల కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల వైపు వెళ్ళే బస్సులకు భారీ డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాల వైపు నుంచి తమ స్వగ్రామాలకు భారీగా ప్రజలు తరలి వస్తున్నారు. విజయవాడ బస్టాండ్ నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు కనెక్టింగ్ బస్సుల కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక సర్వీసులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

Exit mobile version