Proddatur : ప్రొద్దుటూరులో ఇటీవల కలకలం రేపిన పద్మజ అనే మహిళ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. మొదట సహజ మరణంగా భావించిన ఈ ఘటన, పోలీసుల లోతైన విచారణలో భర్తే స్వయంగా చేసిన కిరాతక హత్యగా తేలింది. నిందితుడైన కిరణ్ తన భార్యను అత్యంత క్రూరంగా ప్లాన్ చేసి హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడు కిరణ్కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉండటమే ఈ దారుణానికి ప్రధాన కారణమైంది. తన ప్రియురాలితో కలిసి ఉండటానికి భార్య పద్మజ అడ్డుగా ఉందని భావించిన కిరణ్, ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్తో ఆమె ప్రాణాలు తీసేందుకు సిద్ధమయ్యాడు.
ఈ హత్య కోసం కిరణ్ డిజిటల్ మాధ్యమాలను వాడుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. యూట్యూబ్ ద్వారా ఒక అజ్ఞాత వ్యక్తిని సంప్రదించిన నిందితుడు, ఆన్లైన్ ద్వారా విషాన్ని కొనుగోలు చేశాడు. పద్మజకు ఇష్టమైన స్వీటులో ఆ విషాన్ని కలిపి ఆమెకు తినిపించాడు. విషం తిన్న తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా, మరింత క్రూరంగా ఆమె ముఖంపై దిండు పెట్టి గట్టిగా నొక్కాడు. దీంతో ఊపిరాడక పద్మజ అక్కడికక్కడే మరణించింది. ప్రారంభంలో పద్మజ మరణం సాధారణంగానే జరిగినట్లు కనిపించినా, పోస్ట్మార్టం నివేదికలో ఆమెది హత్య అని తేలడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే భర్త కిరణ్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. అయితే, ఈ హత్యలో కిరణ్ ప్రియురాలికి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడికి విషం అమ్మిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
