Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?

  • టైగర్ ప్రాజెక్ట్ పరిధిలో రహస్య తవ్వకాల ఆరోపణలు
  • అటవీ అధికారులే జేసీబీతో నిధుల వేటకు దిగారా?
  • కుండల్లో బంగారం, వజ్రాల ప్రచారంతో హాట్ టాపిక్
  • విచారణకు ఉన్నతాధికారుల ఆదేశాలు.. నిజాలు ఏంటి?
Hidden Tresure

Hidden Tresure

Hidden Treasure : ప్రకాశం జిల్లా గిద్దలూరు టైగర్ ప్రాజెక్ట్ (Tiger Project) పరిధిలోని ఆరవీటికోట అటవీ ప్రాంతంలో ఊహించని ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. అడవిని, అందులోని వన్యప్రాణులను కాపాడాల్సిన అటవీ శాఖ (Forest Department) అధికారులే స్వయంగా గుప్తనిధుల కోసం అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ వార్త స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది.

తురిమెళ్ళ ఫారెస్ట్ రేంజ్‌కు చెందిన ఒక మహిళా అధికారి, తన కింది స్థాయి సిబ్బంది , కొందరు ట్రైబల్ వాచర్లతో (Tribal Watchers) కలిసి ఈ అక్రమ తవ్వకాలకు స్కెచ్ వేసినట్లు సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా దట్టమైన అటవీ ప్రాంతంలోకి ఒక జేసీబీ (JCB) వాహనాన్ని తీసుకెళ్లి, రాత్రికి రాత్రే భారీగా తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. నమ్మకమైన సిబ్బందితో కలిసి ఆఫీసర్లే ఈ పని చేయించడం చూసి స్థానికులు షాక్ అవుతున్నారు.

ఈ సీక్రెట్ తవ్వకాల్లో కొన్ని ప్రాచీన కాలం నాటి మట్టి కుండలు బయటపడినట్లు ప్రచారం సాగుతోంది. ఆ కుండలలో భారీగా బంగారం, విలువైన వజ్రాలు ఉన్నాయని, అధికారులు వాటిని గుట్టుచప్పుడు కాకుండా బెంగళూరు (Bengaluru) నగరానికి తరలించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకున్నారనే రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఈ నిధుల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.

ఈ గుప్తనిధుల తవ్వకాల వ్యవహారం లీక్ కావడంతో మీడియా ప్రతినిధులు దీనిపై క్లారిఫికేషన్ కోసం ప్రయత్నించారు. అయితే, సంబంధిత అటవీ శాఖ అధికారులు ఎవరూ మీడియా ముందుకు రావడానికి ఇష్టపడలేదు. ప్రస్తుతం ఆ మహిళా అధికారితో పాటు అక్రమ తవ్వకాల్లో పాల్గొన్న సిబ్బంది అందరూ అందుబాటులో లేకుండా పరారైనట్లు తెలుస్తోంది.

రక్షకభటులే భక్షకులుగా మారి.. అటవీ సంపదను నాశనం చేస్తూ నిధుల వేట పడటంపై హయ్యర్ అఫీషియల్స్ సీరియస్ అయ్యారు. ఈ పూర్తి ఘటనపై ఉన్నతాధికారులు లోతైన విచారణకు (Enquiry) ఆదేశించినట్లు సమాచారం. ఈ విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాలి.