ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమను మూసి వేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఫ్యాక్టరీని మూసేసినట్టు ప్రకటిస్తూ బ్యానర్ కట్టింది పోరస్ యాజమాన్యం.బ్యానర్ కడితే సరిపోదు.ఫ్యాక్టరీని సీజ్ చేయాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామస్తుల ఆందోళనకు సీపీఎం మద్దతు ప్రకటించింది.
పోరస్ ఫ్యాక్టరీ మూసివేయాలంటూ చేస్తున్న ఆందోళనల్లో పాల్గొన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఎల్జీ పాలిమర్స్ తరహాలోనే పోరస్ బాధిత మృతులకు రూ. కోటి చెల్లించాలన్నారు.ఈ ప్రమాదం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కన్పిస్తోంది. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి రెండేళ్లు కూడా పూర్తి కాలేదు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన రెండేళ్లకు ముందే పోరస్ ఘటన సంభవించింది. ప్రమాదం సంభవించినప్పుడు హడావుడి చేయడం.. ఆ తర్వాత వదిలేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.
మరోవైపు పోరస్ కెమికల్ కర్మాగారంలో మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెంలోని పోరస్ కెమికల్ కర్మాగారంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం అత్యంత విషాదకరం అన్నారు. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను.
Read Also:Porus Laboratories : కెమికల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి..
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. కష్టం మీద బతికే కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో ఇచ్చిన విధంగానే పోరస్ ప్రమాదంలో చనిపోయినవారికీ రూ.కోటి చొప్పున పరిహారం అందించాలి. ఒక్కో ప్రమాదానికి ఒక్కో తరహా పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించకూడదు.
ఈ ఘటనలో మరో 13మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వీరికి మెరుగైన వైద్యం అందించి న్యాయబద్ధంగా పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రసాయన కర్మాగారాల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. భద్రత ప్రమాణాల నిర్వహణపై అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలి. ఇటువంటి ప్రమాదాల నివారణకు కఠిన నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు పవన్ కళ్యాణ్.