ప్రతి నెల ఒకటవ తేదీ వచ్చిందంటే చాలు ఏపీలో వాలంటీర్లు బిజీ అయిపోతారు. తెల్లవారకముందే తలుపు తట్టి మరీ పెన్షన్లు అందచేస్తుంటారు. 2023 నూతన సంవత్సరం వేళ వాలంటీర్లు పెన్షన్ల పంపిణీలో బిజీగా వున్నారు. నూతన సంవత్సరం రోజు తెల్లవారుజాము నుంచి రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పండుగ కొనసాగుతుంది. కొత్త సంవత్సరంతో పాటే రాష్ట్రంలో పింఛన్ వారోత్సవాలు మొదలయ్యాయి. కోట్లాది రూపాయలు పంపిణీ చేస్తున్నారు.
లక్షలాది మంది అవ్వాతాతలు, వితంతు, ఒంటరి మహిళ, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల ఇళ్లలో కొత్త వెలుగులు వచ్చేశాయి. ఇప్పటి వరకు ప్రతి నెలా రూ.2,500 చొప్పున అందుకుంటున్న పింఛను డబ్బులు ఈరోజు నుంచి ప్రతి నెలా రూ.2,750 చొప్పున అందుకుంటున్నారు.
వైయస్ జగన్ ప్రభుత్వం పెంచిన పెన్షన్ మొత్తం 2,750 రూపాయలు వాలంటీర్లు లబ్ధిదారులకు అందజేస్తున్నారు. మరోవైపు ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2,31,989 మందికి వైయస్ జగన్ ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. జనవరి 3వ తేదీన సీఎం వైయస్ జగన్ రాజమండ్రిలో పింఛను పెంపు వారోత్సవ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయికి చేరాయి పెన్షన్లు. 64.06 లక్షలకు చేరాయి పింఛన్లు.
ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన 2,31,989 పింఛన్లతో కలిపి జనవరి నెలలో రాష్ట్రంలో సామాజిక పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య 64,06,240కి చేరుకుంది. నేడు జనవరి 1వ తేదీ ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ.. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పెరిగిన పింఛను డబ్బులు అందజేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం శనివారమే అన్ని గ్రామ, వార్డు సచివాలయ శాఖల బ్యాంకు ఖాతాల్లో రూ.1,765 కోట్ల నిధులను జమ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు తెలిపారు. 64.06 లక్షల మంది పెన్షనర్లకు రూ.1765.04 కోట్లు విడుదల.. తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్న వాలంటీర్లు.. ఉదయం 08.00 గంటల వరకు 47.12 శాతం పెన్షన్ల పంపిణీ.. 30.18 లక్షల మందికి రూ.830.94 కోట్లు అందచేశామన్నారు.
Read Also: Kim Jong Un: శక్తివంతమైన అణ్వాయుధాలను సిద్ధం చేయండి.. అమెరికాకు కిమ్ పరోక్ష హెచ్చరికలు
