Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు

Ysrcp

Ysrcp

ఎంత చేసినా… ఇంతేనా…? కష్టపడేది మేము, పదవులు అనుభవించేది వాళ్ళా అంటూ… అక్కడ వైసీపీలో అసంతృప్తి పెరిగిపోతోందా? మొత్తం ఒకే కుటుంబం చుట్టూ తిరుగుతుంటే ఇక మేమెందుకన్న అసహనం వ్యక్తం అవుతోందా? పనిచేయకున్నా… ఆ మాజీ మంత్రి పదవి పదిలంగా ఉందన్న చర్చలు సైతం మొదలయ్యాయా? ఎక్కడుందా పరిస్థితి? ఏ నాయకుడి కుటుంబం గురించి పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి? డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది వైసీపీ. ప్రస్తుతం జిల్లాలో ఆ పార్టీకి ఒక రాజ్యసభ సభ్యుడు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. అయితే… ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న జిల్లా పార్టీ నేతలు తిరిగి పుంజుకునేందుకు ప్రస్తుతం కలిసికట్టుగా అడుగులేస్తున్నారట. అదంతా నాణేనికి ఒకవైపు అయితే…. రెండో వైపు మాత్రం అసమ్మతి రాగాలు గట్టిగానే వినిపిస్తున్నాయని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. ఇందుకు కారణాలు కూడా గట్టిగానే ఉన్నాయంటున్నారు. ఎంత కష్టపడినా ఫలితం లేదని, మొత్తం వ్యవహారం ఒక ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతోందని, దశాబ్దాలుగా వారి చెప్పు చేతుల్లోనే నడుస్తోందన్న అసహనం ఎక్కువ అవుతోందట. ఒకప్పుడు కోనసీమ రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ అనారోగ్యం కారణంగా ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. హైదరాబాద్‌లో వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారాయన. కానీ పార్టీ…. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడిగా ఆయన పదవి మాత్రం అలాగే ఉంది. మరోవైపు అమలాపురం అసెంబ్లీ ఇన్ఛార్జ్‌గా విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కొనసాగుతున్నారు. అయితే… శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి లోకల్‌గా పార్టీ బలహీనపడిందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో… అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ పార్టీలో యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం నియోజకవర్గంలో వైసీపీ కేడర్‌ ఎక్కువగా ఈమె వెంటే తిరుగుతోందట. పదవులు విశ్వరూప్ కుటుంబానికి, పార్టీ కోసం పనిచేసేది మేమా అంటూ… నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

పినిపే శ్రీకాంత్ అమలాపురం అసెంబ్లీకే పరిమితం కావడంతో… ఆయన తండ్రి విశ్వరూప్ ఇన్ఛార్జ్‌గా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాన్ని పట్టించుకునేవాళ్ళు లేకుండా పోయారు. ఒకరకంగా గాలికి వదిలేసినట్టు అయింది. ఈ రెండు స్థానాల్లో ఇలా ఉంటే… ఇవి చాలవన్నట్టు ప్రక్కనే ఉన్న పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంపై కూడా విశ్వరూప్ కుటుంబ సభ్యులే కన్నేశారట. పి. గన్నవరంలో ఖాళీగా ఉన్న పార్టీ ఇన్ చార్జ్ పదవిని తమ మనిషికే అప్పగించారు. మండల స్థాయి నాయకుడిని తీసుకుని వచ్చి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తే ఎలాగంటూ మొదట్లో పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆందోళన చేశాయి. రేపు ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే…. ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్‌డ్‌గా ఉన్న అమలాపురం కేటగిరీ మారవచ్చంటున్నారు. అదే జరిగితే… ఎస్సీ రిజర్వ్‌డ్‌గా ఉన్న పి.గన్నవరం వైపు వెళ్లేందుకు విశ్వరూప్‌ కుటుంబం ముందే ప్లాన్‌ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే తర్వాత ఇబ్బంది రాకుండా… ముందే మండల స్థాయి నాయకుడిని నియమించుకున్నట్టు చెప్పుకుంటున్నారు. అటు పి. గన్నవరం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిని రాజోలు పంపింది వైసీపీ అధిష్టానం. ఆమె అయిష్టంగానే అక్కడి బాధ్యతలు చేపట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కూడా అంత యాక్టివ్ గా లేరని అంటున్నారు. అధిష్టానం పిలుపుతో జిల్లా స్థాయిలో చేపట్టే ఆందోళనల్లో మొక్కుబడిగానే పాల్గొంటున్నారట. అలా… కోనసీమ జిల్లాలో పార్టీ బలపడుతోందని సంతోషపడాలో లేక అసంతృప్తులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని బాధపడాలో అర్దం కావడం లేదని అంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. విచిత్రం ఏంటంటే… ఇక్కడ పార్టీకి నేతల కొదవలేదు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, కుడిపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్ వంటి వాళ్ళు ఉన్నారు. అయినాసరే…. యాక్టివిటీ అంతగా ఉండటంలేదని, నాయకుల మధ్య విభేదాలే అందుకు కారణమా అన్న అనుమానాలు కింది స్థాయిలో పెరుగుతున్నాయి.