OTR: మేయర్ సీటుపై కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య కోల్డ్ వార్

Otr

Otr

స్థానిక ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ విడుదల కాకముందే ఆ నగరంలో మేయర్ సీటు విషయంలో అధికార పార్టీలో క్యాస్ట్ వార్ మొదలైందట. కీలకమైన రెండు ప్రధాన కులాల మధ్య సీటు చేజిక్కించుకోవటం కోసం జరుగుతున్న వార్ ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చర్చగా మారిందట. డైరెక్ట్ అవకాశం రావటంతో ఎట్టి పరిస్థితుల్లో చాన్స్ మిస్ అవకూడదని అన్ని రకాలుగా తమకు టికెట్ ఇవ్వటానికి ఉన్న అర్హతల లెక్కల చిట్టా సిద్ధం చేసుకున్నారట. అయితే అసలు నోటిఫికేషన్ రాకుండా.. రిజర్వేషన్ ఎవరికి తేలకుండా నేతలు చేస్తున్న హడావుడిపై మాత్రం.. ఆలూ లేదు చూలు లేదనే సామెతను గుర్తుకు తెస్తోంది. ఇంతకీ కులాల మధ్య వార్ పీక్ కి వెళ్లిన ఆ మేయర్ సీటు ఎక్కడ?అక్కడ నేతల లెక్కలపై జరుగుతున్న చర్చ ఏంటి?

బెజవాడ నగర మేయర్‌గా అధికార పార్టీ నుంచి బరిలోకి దిగటానికి రెండు ప్రధాన కులాల నుంచి నేతలు పోటీ పడటం రాజకీయంగా చర్చగా మారింది. కూటమిలో రెండు ప్రధాన కులాలుగా ఉన్న కమ్మ, కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఈ సీటు కోసం పోటీ పడటంతో పొలిటికల్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కాపు సామాజిక వర్గం నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా తన కుమారుడు బోండా సిద్ధార్థకు సీటు దక్కించటం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట. ఇదే సమయంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి దేవినేని ఫ్యామిలీ నుంచి మాజీ కార్పొరేటర్ దేవినేని అపర్ణ, గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రస్తుతం టిడిపిలో ఎంపీ కేసినేని చిన్ని వర్గంలో కొనసాగుతున్న బొప్పన భవకుమార్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనే చర్చ అధికార పార్టీలో జరుగుతుందట.

గతంలో కార్పొరేటర్లు గెలవగా అందులో ఒకరిని మేయర్గా అధిష్టానం నిర్ణయించేది అయితే 20 ఏళ్ల తర్వాత ప్రత్యక్షంగా మేయర్ కోసం అభ్యర్థిని బరిలోకి దింపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అందుకు అనుకూలంగా సవరణలు చేసింది. దీంతో ఈ అవకాశాన్ని కచ్చితంగా వదులుకోకూడదు అని ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన నేతలు పావులు కదపటం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చర్చగా మారిందట. కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య ఈ మేయర్ సీటు వ్యవహారం కోల్డ్ వార్ గా మారిందనే చర్చ పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది.

ఇందులో మొదటి వరుసలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కుమారుడు బోండా సిద్ధార్థ్ ఉన్నారు మొన్నటి వరకు అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని తన మాటలతో ఇబ్బంది పెట్టిన బోండా ఉమా ఇప్పుడు తన కుమారుడిని ప్రత్యక్ష ఎన్నికల్లో డైరెక్ట్ గా మేయర్ చేయటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట విదేశాల్లో ఉన్నత విద్య చదివి ఉద్యోగాలు చేసి వచ్చిన సిద్ధార్థ కు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో పాటు తల్లి కమ్మ భార్య రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కావటం కూడా కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారట. దీంతోపాటు ఇప్పటివరకు విజయవాడ మేయర్ స్థానాన్ని కాపు సామాజిక వర్గానికి కేటాయించలేదని ఈసారి కాపు సామాజిక వర్గానికి చెందిన సిద్ధార్థకి సీటు ఇస్తే అది విజయవాడ నగరంలో మూడు నియోజకవర్గాల్లో ఉన్న కాపులకు టీడీపీని మరింత దగ్గర చేస్తుంది అనే లెక్కలు చెబుతున్నారట.

రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు ఇప్పటివరకు మంత్రి పదవి కూడా దక్కలేదని ఆవేదన గురైన బోండా ఉమా తన కుమారుడికి మేయర్ సీటు అధిష్టానం ఇవ్వటం ద్వారానైనా న్యాయం చేస్తుందని భావిస్తున్నారట తన కుమారుడికి టికెట్ కేటాయింపు కోసం ఎంపీ ఎమ్మెల్యేలు సహా సీనియర్ నేతలు మద్దతు కూడగట్టే పనిలో ఉమా ఉన్నారట. గతంలో టీడీపీ రెండు పర్యాయాలు కమ్మ సామాజిక వర్గానికి మేయర్ సీటు కోసం అవకాశం ఇచ్చింది కాబట్టి ఈసారి కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనే అంశాన్ని తెర మీదకి తెస్తున్నారట.

ఇక అధికార పార్టీలో కమ్మ సామాజిక వర్గం నుంచి ఎక్కువమంది మేయర్ సీట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట. దేవినేని ఫ్యామిలీ నుంచి ఇప్పటికే రెండుసార్లు కార్పొరేటర్ గా పనిచేసిన దేవినేని అపర్ణ ఈసారి మేయర్ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సన్నిహితంగా ఉండే దేవినేని చంద్రశేఖర్ తన తల్లికి మేయర్ సీటు విషయంలో లైన్ క్లియర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఒకవేళ యువతకు జెన్జీ కోటాలో టికెట్ ఇవ్వాలని భావిస్తే తన భార్య మహితకు ఆ అవకాశం ఇవ్వాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. కేంద్ర ప్రభుత్వానికి చెందిన DRDO లో ఉద్యోగం చేసి ప్రస్తుతం రాజీనామా చేసిన తన భార్య మహితకు అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన కూడా దేవినేని చందు సిద్ధం చేశారట.

ఇక 2019లో వైసీపీ నుంచి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి పరాజయం పాలైన మాజీ కార్పొరేటర్ బొప్పన భవకుమార్ ప్రస్తుతం టీడీపీలో చేరి ఎంపీ కేసీనేని చిన్ని వర్గంలో కొనసాగుతున్నారు 2014 సమయంలో ఆయన మేయర్ స్థానం కోసం వైసీపీ నుంచి పోటీపడినా అప్పుడు అదృష్టం దక్కకపోవడంతో ఇప్పుడు తన ప్రయత్నాలు ముమ్మరం చేశారట వంగవీటి రాధ మద్దతును బొప్పన భవకుమార్ కూడగట్టే పనిలో ఉన్నారట. ఇక స్వచ్ఛందర కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పట్టాభి కూడా మేయర్ గా బరిలోకి దిగడానికి తన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ జరుగుతుందట. దీంతో విజయవాడ నగరంలో మేయర్ సీటు విషయంలో కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య కాస్ట్ వార్ లీక్ లెవెల్ వరకు చేరిందనే చర్చ జరుగుతోందట. అయితే ఇంకా రిజర్వేషన్లు కూడా ఖరారు కానీ స్థానంలో జరుగుతున్న ఈ రచ్చ ఆలూ లేదు చూలు లేదు అనే చందంగా ఉందని పొలిటికల్ పండిట్స్ సెటైర్లు వేస్తున్నారు.