OTR: ఉషశ్రీ దూకుడు.. సవిత సైలెన్స్..! మహిళా నేతల వార్‌లో ట్విస్ట్..!

Otr

Otr

నిన్నటి వరకు ఢీ అంటే ఢీ అంటూ తలపడిన మహిళా మంత్రి సడన్‌గా ఎందుకు సైలెంట్‌ అయ్యారు. రాజకీయ ప్రత్యర్థి అదే రేంజ్‌లో… ఇంకా చెప్పాలంటే అంతకు మించి చెలరేగుతున్నా… ఆమె మాత్రం ఎందుకు కామ్‌ అయ్యారు? మాజీ మంత్రి ఎంత ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నా… మంత్రిలో మునుపటి రియాక్షన్స్‌ ఎందుకు కనిపించడం లేదు? ఎవరా ఇద్దరు మహిళా నేతలు? ఏంటా స్టోరీ?

పాజిటివ్‌ అయినా… నెగెటివ్‌ అయినా…. సమఉజ్జీల మధ్య పోటీ అంటే… రక్తి కడుతుంది, ఆసక్తి కరంగా ఉంటుంది. అందులోనూ రాజకీయాల్లో అంటే… ఆ కిక్కే వేరు. శ్రీ సత్యసాయి జిల్లాలో దాదాపు అదే స్థాయిలో ఇన్నాళ్ళు ఢీ అంటే ఢీ అన్నారు మంత్రి, మాజీ మంత్రి. కానీ…ప్రస్తుతం మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్‌ అఫెన్స్‌ మోడ్‌లో ఉండగా… మంత్రి సవిత మాత్రం డిఫెన్స్‌ ఆడటం చర్చనీయాంశమైంది. పెనుకొండ నియోజకవర్గం కేంద్రంగా ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.గత ఎన్నికల నుంచి ఇక్కడ మహిళా నేతలిద్దరి మధ్య జరుగుతున్న వార్… సినిమాను తలపిస్తోందట. అయితే… ఇక్కడ వయిలెన్స్ లేదుగానీ… డైలాగ్స్‌తో పొలిటికల్ హీట్ క్రియేట్ చేస్తున్నారు. గతంలో కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఉషశ్రీ…వైసీపీ అధిష్టానం నిర్ణయం మేరకు 2024 ఎన్నికల్లో పెనుకొండకు షిఫ్ట్‌ అయ్యారు. ఆమెకు ప్రత్యర్థిగా… టీడీపీ నుంచి సవిత తలపడి విజయం సాధించారు. ఉషశ్రీ చరణ్ కొత్తగా పెనుకొండకు రావడం, సవితకు అప్పటికే క్రేజ్‌ ఉండటం కలిసొచ్చిందని అంటారు. ఇక అదే ఊపులో మంత్రి పదవి కూడా దక్కింది. ఇక కేబినెట్‌ బెర్త్‌ దక్కాక వైసీపీపై చాలా దూకుడుగా ఆరోపణలు చేస్తున్నారు సవిత. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ మీద తీవ్ర విమర్శలు చేయడంలో ఆమె ముందుంటున్నారు. అందుకు ప్రతిగా ఉషశ్రీ కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తూ వచ్చారు. సవిత ఎప్పుడు జగన్ గురించి మాట్లాడినా వెంటనే సీరియస్‌గా స్పందిస్తున్నారు మాజీ మంత్రి. అలాగే.. పెనుకొండలో ఏ విషయం జరిగినా ఇద్దరి మధ్య తీవ్రమైన మాటల యుద్ధం జరుగుతోంది. ఇది రోజురోజుకి పెరిగి ఇరువర్గాలు దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. ఉషశ్రీ మరింత దూకుడు పెంచి ఇటీవల మంత్రి సవిత వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతున్నారు.

ముఖ్యంగా ఆమె కుటుంబ వ్యవహారాలు, అలాగే ఆస్తులకు సంబంధించిన విషయాల మీద మాజీ మంత్రి చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. మొదట్లో వీటన్నింటికీ స్పందిస్తూ వచ్చిన సవిత.. ఉన్నట్టుండి ఇటీవల సైలెంట్ అయ్యారు. ప్రత్యర్థి ఎలాంటి పదునైన విమర్శలు చేసినప్పటికీ నేరుగా తాను రియాక్ట్‌ అవకుండా… తన అనుచరులతో కౌంటర్స్‌ ఇప్పిస్తున్నారు మంత్రి. ఉషశ్రీ చరణ్ కళ్యాణదుర్గంలో ఏం చేశారో మేం చెబుతామంటూ మాటల దాడి మొదలుపెట్టారు. కానీ… ఉషశ్రీ మాత్రం వాళ్ళను పట్టించుకోకుండా….మంత్రి సవితనే మళ్లీ మళ్ళీ టార్గెట్ చేస్తున్నారు. నన్ను ఎదుర్కొనే ధైర్యం లేక, నేను అడిగే వాటికి సమాధానం చెప్పలేక వేరేవాళ్ళతో ఆరోపణలు చేయిస్తున్నారంటూ మరింత ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇక్కడే పరిశీలకులకు కొత్త డౌట్స్‌ వస్తున్నాయి. మంత్రి సవిత ఉన్నట్టుండి ఎందుకు సైలెంట్‌ అయ్యారు? తాను రియాక్ట్‌ అవకుండా తన మనుషులతో ఎందుకు మాట్లాడిస్తున్నారంటూ చర్చలు జరుగుతున్నాయి. అందుకు స్పందనగా… మా మేడమ్‌ది స్టేట్‌ లెవల్‌, ఇప్పుడామె మంత్రి, అందుకు తగ్గట్టు హుందాగా మాట్లాడతారు. మీది గల్లీ లెవల్‌ అంటూ కౌంటర్స్‌ వేస్తున్నారట మంత్రి సన్నిహితులు.

అంత వరకు బాగానే ఉన్నా, వాళ్ళు చెప్పేది ఎలా ఉన్నా…. మంత్రి సవితకు సంబంధించిన కుటుంబ వ్యవహారాలను మాజీ మంత్రి టచ్‌ చేయడం వల్లే ఆమె సైలెంట్‌ అయ్యారా అన్న సందేహాలు వస్తున్నాయట కొందరికి. రీజన్‌ ఏదైనా ప్రస్తుతం పెనుకొండలో కొత్త వాతావరణం కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.