ఆ ఎమ్మెల్యే ఏదో చేద్దామనుకుని ఒక ప్రోగ్రామ్ మొదలుపెడితే… అది ఇంకేదేదో అయిపోతోందా? సూది కోసం సోదికి పోతే…పాతవేవో బయటపడ్డాయన్న సామెతను గుర్తుకు తెస్తోందా? అనుచరుల ఆగడాలు శృతి మించిపోయి… అప్రతిష్ట పెరిగిపోతోందా? దాని కవరింగ్ కోసం చేస్తున్న విన్యాసాలు బూమరాంగ్ అవుతున్నాయా? ఎవరా శాసనసభ్యుడు? ఏంటా విన్యాసాలు? ఎలా తేడా కొడుతున్నాయి?
కర్నూలు జిల్లా ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం… ఇటీవలి కాలంలో ఏదో ఒక రూపంలో వివాదాస్పద వార్తల్లో ఉంటోంది. ఇక్కడి నుంచి బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు డాక్టర్ పార్థసారథి. కూటమి పార్టీల మధ్య గొడవలతోనో, ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలతోనో ఎప్పుడూ ఏదో ఒక రచ్చ అవుతూనే ఉంది. స్థానిక కాషాయ నాయకులు కొందరు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే అనుచరులు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా భూములు, ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని కేసులవడంతో పోలీస్ కేసుకు కూడా బుక్ అయ్యాయి. ఇసుక ట్రాక్టర్ల యజమానులకు బెదిరింపులు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహనాలు సైతం నెలవారీ మామూళ్లు మాట్లాడుకోవాలని ఒత్తిడి చేయడం, మహిళలకు వేధింపులు…ఇలా ఒకటేమిటి, అనేక వివాదాల్లో ఆదోని బీజేపీ నాయకులు, కార్యకర్తల పేర్లు మోగిపోతున్నాయి. ఓ బాలికకు పార్టీ కార్యకర్త మహేష్ నాయక్ వేధింపుల అంశం బాగా రచ్చ అయింది. అతని వేధింపులు భరించలేక ఆ బాలిక, ఆమె బంధువులు ఎమ్మెల్యే పార్థసారథికి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే….. అక్కడున్న వాళ్ళు ఏకంగా బాలికపైనే దాడికి తెగబడ్డారట. చివరికి అది పొక్సో కేసు దాకా వెళ్ళింది. ఇలా… గడిచిన రెండేళ్ళ కాలంలో చాలా వివాదాలు చుట్టుముట్టాయి ఎమ్మెల్యే శిబిరాన్ని. వీటన్నిటితో పార్థసారథికి ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా… అనుచరులు కీలకంగా ఉండడంతో ఆయన ప్రతిష్ట మసకబారుతోందన్న అభిప్రాయం బలంగా ఉంది.
పైగా… ఈ వివాదాలను ప్రత్యర్థి వైసీపీ ప్రజల్లో విస్తృతంగా చర్చకు పెట్టి రాజకీయ లబ్ది పొందుతోందట. అదే సమయంలో కూటమి కొట్లాటలు కూడా తక్కువేం కాదు. దీంతో… సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్లాగా… అన్ని సమస్యలకు పరిష్కారం ఒక్కటేనని భావించారట ఎమ్మెల్యే. ప్రజలకోసం పార్థసారథి అంటూ ప్రస్తుతం వీధులన్నీ చుట్టేయడం అందులో భాగమేనని అంటున్నారు. అందులో కూడా… ఏదో… వెళ్ళామా..? వచ్చామా…? అన్నట్టు కాకుండా భిన్నమైన పనులు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారాయన. ఇందులో భాగంగా ఒకరోజు గాడిద పాలు తాగారు ఆదోని ఎమ్మెల్యే. కాలనీలో పిట్టకథలు చెప్పారు. హోటల్లో దోశలు వేసి, టీ తయారు చేసి నేను మీ వాడినేనని జనానికి సందేశం పంపే ప్రయత్నం చేశారు. ఇక ఎమ్మెల్యే వేసిన దోశను ఓ మహిళ 750 రూపాయలు పెట్టి కొనడం ఇక్కడ కొసమెరుపు. అలాగే… పెద్దతుంబలం శ్రీరామాలయంలో చెత్త ఊడ్చి కుప్పలు ఎత్తేశారు సారధి. మరోచోట రైతులతో కలసి విత్తనాలు నాటారు. ఇలా వినూత్నంగా ఎమ్మెల్యే చేస్తున్న పనుల గురించి ఇప్పుడు నియోజకవర్గంలో మాట్లాడుకుంటున్నారు.
డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎమ్మెల్యే యాత్రలు చేయడం ఓకేగానీ….అక్కడే సరికొత్త సమస్యలు కూడా వస్తున్నాయట. కూటమిలో కుమ్ములాటలు వీధికెక్కి పరువు పోతోందని అంటున్నారు. ఆదోని బావాజీపేటలో జరిగిన గొడవని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. మా కాలనీ సమస్యలు మేమే చూసుకుంటాం… మీరు రావాల్సిన పనిలేదు, అసలు కూటమిలో గొడవలకు ఎమ్మెల్యేనే కారణం అంటూ స్థానిక టీడీపీ నాయకులు రివర్స్ అవడంతో రచ్చ జరిగింది. ఆయన సమక్షంలోనే ఈ వివాదం రేగడం చూస్తుంటే…. నియోజకవర్గంలో కూటమి ఐక్యత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో సరికొత్త చర్చలు సైతం మొదలయ్యాయి. అనుచరుల ఆగడాలను కవర్ చేసుకోవడానికి ఎమ్మెల్యే ఏదో… తంటాలు పడుతుంటే…. కూటమి కుమ్ములాటలు తెర మీదికి వచ్చి ఇష్యూ ఇంకో రకంగా మారుతున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. జనంలోకి వెళ్లి సమస్యలు తెలుసుకోవడం మంచిదే గానీ…. పలుచనవడానికి అది కూడా ఒక కారణం కాకూడదు కదా అని అంటున్నారు.

