NTV Telugu Site icon

నారావారిపల్లెలో నారా రోహిత్ నిరసన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తల్లిదండ్రులు దివంగత నారా అమ్మణమ్మ, నారా కర్జూర నాయుడు సమాధుల వద్ద ప్రముఖ సినీనటుడు నారా రోహిత్ నిరసన తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వైసీపీ ముష్కరమూకలు చేసిన మానసిక దాడికి నిరసనగా రోహిత్ తమ పూర్వీకుల సమాధుల వద్ద నివాళులర్పించి బైఠాయించారు. తమ పెదనాన్న చంద్రబాబునాయుడు, పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు నారా లోకేష్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి యావత్ తెలుగుదేశం పార్టీ కేడర్ కు ఆదర్శంగా నిలిచారన్నారు.

అన్నగారు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకూ నందమూరి కుటుంబం ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు, ఎప్పుడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదు. ఒక ముఖ్యమంత్రి సతీమణి హోదాలో ఉండి కూడా తమ పెద్దమ్మ భువనేశ్వరి రాజకీయాల్లో చేసుకోలేదన్నారు. గడప దాటలేదు. సేవా కార్యక్రమాలే పరమావధిగా జీవిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. అటువంటి ఆదర్శనీయురాలిపై లేనిపోని నిందలు మోపడానికి వైసీపీ నేతలకు నోరెలా వచ్చిందో అర్థంకావడంలేదన్నారు నారా రోహిత్. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు నారా రోహిత్.