Site icon NTV Telugu

Nara Lokesh: నీట్ పరీక్షలు వాయిదా వేయండి.. కేంద్రమంత్రికి లేఖ

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. నీట్ పీజీ-2022 పరీక్షలు వాయిదా వేయాలని లేఖలో కోరారు. కోవిడ్ కారణంగా గతేడాది నీట్ పరీక్ష నిర్వహణ, కౌన్సెలింగ్ ఆలస్యం కావడం వల్ల తదుపరి సెషన్‌కు అభ్యర్థులు సిద్ధంగా లేరని లోకేష్ తన లేఖలో ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ విద్యార్థుల ఏడాది ఇంటర్న్ షిప్ పూర్తి కాకపోవడంతో వారు నీట్ పీజీ పరీక్షకు అర్హత సాధించే అవకాశం లేకుండా పోయిందన్నారు. దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్షకు 1.7 లక్షల మంది హాజరవుతుండగా.. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 వేల మంది విద్యార్థుల నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని నారా లోకేష్ కోరారు.

నీట్ పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వడానికి కూడా విద్యార్థులకు సమయం లేకుండా పరీక్షా తేదీలను ప్రకటించారని నారా లోకేష్ తన లేఖలో ఆరోపించారు. మే 21 నే పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. కౌన్సిలింగ్‌కు హాజరుకావాలో లేక పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వాలో తేల్చుకోలేక విద్యార్థులు అయోమయ స్థితిలో ఉన్నారన్నారు. కోవిడ్ రెండో దశ సందర్భంగా వేసిన డ్యూటీల కారణంగా చాలా మంది ఇంటర్న్ షిప్ పూర్తి చేయలేకపోయారని వివరించారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేసిన వారికీ పరీక్ష రాసే అవకాశం కల్పించాలని లోకేష్ కోరారు. విద్యార్థుల భవిష్యత్, అర్హులందరికీ అవకాశం కల్పించే విధంగా ఆలోచన చేసి వారి కోరిక మేరకు నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.

Chandra Babu: 30 ఏళ్లు అధికారంలో ఉండేలా టీడీపీ నేతలు పనిచేయాలి

Exit mobile version