విశాఖపట్నంలో భూకబ్జాలపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. విశాఖని రాబంధుల్లా పీక్కుతింటున్నారు వైసీపీ కబ్జాకోరులు అంటూ ఫైర్ అయ్యారు.. కన్నుపడిన ప్రతి గజాన్ని కబ్జా చేస్తూ విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేస్తున్నారని విమర్శించిన ఆయన.. ఏకంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎస్పీకి చెందిన స్థలాన్నే వైసీపీ ఎంపీ ఆక్రమించడం వైసీపీ కబ్జాపర్వంలో సరికొత్త కోణం అన్నారు. స్థలం కబ్జా చేయడమే కాకుండా రివర్సులో ఎంపీ మనుషులు ఎస్పీకే వార్నింగ్ ఇవ్వడం విశాఖలో వైసీపీ ల్యాండ్ మాఫియా అరాచకాలకు అద్దం పడుతుందన్నారు.
Read Also: AP: సర్కార్ నిర్లక్ష్యంతో కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యామ్.. హైకోర్టులో పిల్..
ఇక, ప్రజల్ని కాపాడే పోలీసులకే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు నారా లోకేష్.. విశాఖపట్నంలో వైసీపీ కబ్జాల పర్వానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చిన ఆయన.. బాధితులంతా బయటకు రండి.. వైసీపీ కబ్జా కోరల నుండి విశాఖని రక్షించుకుందాం.. మీకు అండగా టీడీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. మరోవైపు.. సీఎం వైఎస్ జగన్పై హాట్ కామెంట్లు చేశారు లోకేష్.. సీఎం వైఎస్ జగన్ మాటలు కోటలు దాటుతాయి.. కానీ, చేతలు తాడేపల్లి ప్యాలెస్ కాంపౌండ్ కూడా దాటవని ఎద్దేవా చేశారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు కనీసం రూ.20 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన జగన్.. ఇప్పుడు బాకరపేట బస్సు ప్రమాద ఘటనలో రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మేం కొత్త డిమాండ్లు ఏమి పెట్టడం లేదు.. ఆనాడు తాను అన్నట్టుగానే బాకరాపేట ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలివ్వాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.