NTV Telugu Site icon

Nara lokesh: ఎమ్మెల్సీ అనంతబాబు కేసు.. సజ్జలపై లోకేష్ తీవ్ర ఆరోపణలు..

Nara Lokesh

Nara Lokesh

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చర్చగా మారింది.. తన మాజీ డ్రైవర్‌ సుబ్రహ్యణ్యాన్ని హత్య చేశాడంటూ అనంతబాబుపై ఆరోపణలు వస్తున్నాయి.. ఈ తరుణంలో.. సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.. హత్య చేసిన అనంతబాబు.. సజ్జలను కలిశారంటూ విమర్శించిన ఆయన.. అనంతబాబును మరో 24 గంటల్లో అరెస్ట్ చేయాలి.. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. హత్య చేసి 72 గంటలైతే.. ఇప్పటి వరకు అరెస్ట్ చేయరా..? అని నిలదీశారు.. హత్య చేసిన అనంతబాబు.. సజ్జలను, ఎమ్మెల్యే ద్వారంపూడిని కలిశారు.. ప్రజలను.. టీడీపీ నేతలను వేధించిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలనూ వేధిస్తోందని ఫైర్ అయ్యారు.

Read Also: Sri Lanka Crisis: శ్రీలంక సర్కార్‌ కీలక నిర్ణయం..

ఏపీలో పోలీస్ రాజ్ నడుస్తోందని వ్యాఖ్యానించార నారా లోకేష్‌.. ఏ చిన్న కామెంట్ చేసినా.. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టినా వెంటనే కేసులు పెట్టేస్తున్నారు.. హత్యలు చేసి తిరుగుతోన్నా అనంతబాబు మీద కేసు పెట్టడానికి తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. గంజాయి రవాణాలోనూ అనంతబాబు ప్రధాన భూమిక పోషిస్తున్నారన్న ఆయన.. గంజాయిని తగులబెట్టినందుకే డీజీపీని పంపించారని చెప్పుకొచ్చారు. ఇంత జరుగుతోంటే సజ్జల నువ్వేం చేస్తున్నావ్ రా..!? అంటూ ఘాటుగా స్పందించారు. ఇక, నా మీద ఇప్పటికే 14 కేసులున్నాయి.. కావాలనుకుంటే మరో 10 కేసులు పెట్టుకోండి.. జగనులా కేసులకు భయపడేదే లేదన్నారు లోకేష్.. వాయిదాల మీద వాయిదాలు అడుగుతూ జగన్ తప్పించుకు తిరుగుతున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. తప్పు చేయనప్పుడు తన కేసులను వెంటనే పరిష్కరించాలని జగన్ కోర్టును అడగొచ్చు కదా..? తన కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేయమని జగన్ అడగగలరా..? అని నిలదీశారు.