ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు లేఖ రాశారు టీడీపీ నేత నారా లోకేష్.. తొలగించిన ఆప్కాస్ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని లేఖలో కోరిన ఆయన.. 20 నెలల జీతాల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.. పాదయాత్ర చేస్తూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేనున్నాను.. నేను మీ గోడు విన్నాన్నారు.. మీ మాటలు నమ్మి ఓట్లేసిన ఆ ఉద్యోగులంతా మీరు సీఎం కాగానే.. వాళ్లకిచ్చిన హామీలన్నీ నెరవేర్చుతారని ఆశ పెట్టుకున్నారు.. కానీ, మీరు సీఎం కాగానే హామీలన్నీ గాలికొదిలేశారని లేఖలో దుయ్యబట్టారు.. ఇక, మీ నేతలు పోస్టులు అమ్ముకోవడం వల్ల ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించేశారని ఆరోపించారు నారా లోకేష్.
ఒక్కవైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న వేలాది మందిని అప్కాస్ లోకి తీసుకున్నట్టు పత్రాలు ఇచ్చి, ప్రభుత్వ ఉద్యోగులు కింద సీఎఫ్ఎంఎస్ ఐడీలు క్రియేట్ చేసి ఉద్యోగుల గొంతు కోశారని ఆరోపించారు నారా లోకేష్.. ఏజెన్సీలు లేకుండా జీతాలు ఎలా ఇవ్వగలమంటూ 20 నెలలు జీతాలు ఎగ్గొట్టి అందరినీ ఉద్యోగాల్లోంచి తీసేసి పంపేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ప్రభుత్వం చేసిన నిర్వాకాల వల్ల 20 నెలల జీతాలు రాక, వేలాది మంది ఉద్యోగుల కుటుంబాలు పస్తులుంటున్నాయన్నారు.. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులుగా వీరికి సీఎఫ్ఎంఎస్ లో నమోదు చేయడంతో తెల్ల రేషన్కార్డులు రద్దయ్యాయని సీఎం దృష్టికి తీసుకెళ్లిన నారా లోకేష్.. వారు అమ్మ ఒడితోపాటు ప్రభుత్వ పథకాలు దేనికీ అర్హులు కాకుండా పోయారన్నారు.