MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా

  • స్థానిక ఎన్నికల్లో వైసీపీదే గెలుపంటూ ధీమా
  • నెల్లూరు వైసీపీకి కంచుకోట
  • కూటమి ప్రభుత్వంపై మిథున్ రెడ్డి ఫైర్
  • 10కి 10 సీట్లు గెలుస్తామని ప్రకటన
Mithun

Mithun

నెల్లూరు జిల్లాలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో ఘనవిజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల బరిలో నిలిచే ప్రతి ఒక్క అభ్యర్థికి పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

నెల్లూరు జిల్లా వైసీపీకి తిరుగులేని కంచుకోట

నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొదటినుంచీ తిరుగులేని కంచుకోట అని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. గత 20 ఏళ్ల రాజకీయ చరిత్రను గమనిస్తే జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ , మెజారిటీ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టంగట్టారని గుర్తుచేశారు. పార్టీ పట్ల జిల్లా ప్రజలకు ఉన్న అభిమానం చెక్కుచెదరలేదని, రాబోయే రోజుల్లో కూడా ఇదే విజయాన్ని పునరావృతం చేస్తామని తెలిపారు.

కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంపై మిథున్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో వారికి బుద్ధి చెబుతారని విమర్శించారు.

10కి 10 స్థానాల్లో జయభేరి ఖాయం

రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఎంపీ పేర్కొన్నారు. జిల్లాలోని మొత్తం 10కి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జయభేరి మోగించడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.