రాష్ట్రంలో విద్యుత్ రంగంలో నెలకొన్న సమస్యలపై విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో ఆదివారం సాయంత్రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. బొగ్గు కొరత వల్ల దేశంలోని అనేక రాష్ట్రాలు విద్యుత్ సమస్యలతో సతమతం అవుతున్నాయని తెలిపారు. ఏపీలో విద్యుత్ సమస్యలకు కూడా దేశంలోని బొగ్గు కొరత కారణమని వెల్లడించారు. అటు కరోనా సంక్షోభం, భారీ వర్షాలు బొగ్గు ఉత్పాదనను ప్రభావితం చేశాయని తెలిపారు. అంతేకాకుండా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావం కూడా బొగ్గు లభ్యతపై పడిందని వివరించారు.
విద్యుత్ కొరత ఏర్పడటంతో బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఏర్పడిందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. విద్యుత్ కొనుగోలు చేసేందుకు అనేక రాష్ట్రాలు బారులు తీరుతుండటంతో విద్యుత్ ధర అమాంతం పెరిగిపోయిందని చెప్పారు. అనేక రాష్ట్రాల బాటలోనే ఏపీలోనూ విద్యుత్ సరఫరాపై ఆంక్షలు విధించామని వివరించారు. నిబంధనల ప్రకారం థర్మల్ ప్లాంట్లో 24 రోజులకు సరిపడా నిల్వలు ఉంచుకోవాలని.. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. అనేక రాష్ట్రాల్లోని థర్మల్ ప్లాంట్లలో చూస్తే రెండు నుంచి ఐదు రోజులకు సరిపోయే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఏపీలో విద్యుత్ కొరతను తాము అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మే తొలివారం నాటికి ఏపీలో విద్యుత్ సమస్యలు చక్కబడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
CM Jagan: 2024 ఎన్నికలపై ఫోకస్.. ఈనెల 27న వైసీపీ నేతలతో కీలక భేటీ
