Minister Narayana : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం రూపురేఖలను మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (VMRDA) మాస్టర్ ప్లాన్పై తుది విడత అభిప్రాయాలను సేకరించి, త్వరలోనే దానిని ఖరారు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. VMRDA మొత్తం పరిధి 6,836 చదరపు కిలోమీటర్లు ఉండగా, అందులో 4,387.36 చదరపు కిలోమీటర్ల మేర ‘2041 మాస్టర్ ప్లాన్’ ఇప్పటికే సిద్ధమైందని, మిగిలిన ప్రాంతానికి సంబంధించిన ప్లాన్ను రానున్న అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. గతంలో 2021లో రూపొందించిన మాస్టర్ ప్లాన్పై ప్రజలు , ప్రజాప్రతినిధుల నుంచి భారీగా అభ్యంతరాలు రావడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దానిని రీవిజిట్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
మాస్టర్ ప్లాన్పై మొదటి విడతలో 3,720, రెండో విడతలో 1,236 అభ్యంతరాలు రాగా, ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాల్లో దాదాపు 90 శాతానికి పైగా సమస్యలను పరిష్కరించామని మంత్రి నారాయణ వివరించారు. సమీక్షకు రాలేకపోయిన ఇతర ఎమ్మెల్యేలతో కూడా చర్చించిన తర్వాతే తుది మాస్టర్ ప్లాన్ను అధికారికంగా ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక నగర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు హైదరాబాద్ తరహాలో విశాఖలో కూడా ‘సెమీ రింగ్ రోడ్డు’ నిర్మాణాన్ని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. రాంబిల్లి నుంచి భోగాపురం వరకు సుమారు 102 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రోడ్డుకు సంబంధించిన డీపీఆర్ (DPR) ఈ నెల చివరి నాటికి సిద్ధమవుతుందని, దీనితో పాటు భోగాపురం ఎయిర్పోర్టుకు బీచ్ కారిడార్ అనుసంధానంపై కూడా ప్రతిపాదనలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య మెరుగుదల కోసం మురుగునీటి శుద్ధి ప్లాంట్లను (STP) ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అదేవిధంగా, ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ఆస్తి పన్ను (Property Tax) విషయంలో పాత పద్ధతినే కొనసాగిస్తున్నామని ఆయన ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. విశాఖను గ్లోబల్ సిటీగా మార్చే క్రమంలో మాస్టర్ ప్లాన్ , రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులు అత్యంత కీలకంగా మారనున్నాయని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు.
