Minister Venugopala Krishna: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లను ఉద్దేశిస్తూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శలు చేశారు. రాష్ట్రంలో దురదృష్టకరమైన అనైతిక కలయికలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, పరిపాలన పట్ల చంద్రబాబు మాట్లాడలేడు అని.. ప్రజల దృష్టిని మరల్చడానికి వైసీపీ నేతలను దుర్మార్గులుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుట్రలకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నిదర్శనమని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. వైసీపీ నేతలపై బురద జల్లి లబ్ధి పొందాలని చూస్తున్నారని.. అందుకే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోని యూకే నుంచి టీడీపీ వాళ్ళు అప్లోడ్ చేశారని మండిపడ్డారు. ఆ వీడియోని అమెరికన్ ఫోరెన్సిక్ వాళ్లు ఎగ్జామిన్ చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనైతికంగా కలుస్తున్నారని విమర్శించారు.
Read Also: ATG Tyres Company: టైర్ల కంపెనీని ప్రారంభించిన సీఎం జగన్..
మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా మీడియాతో మాట్లాడారు. అమలాపురం అల్లర్లలో ఉద్దేశపూర్వకంగా పాల్గొన్న వారిని మాత్రమే ముద్దాయిలుగా పరిగణించాలని పోలీస్ శాఖ వారిని కోరారు. ఆకతాయితనంగా ఉద్యమంలో పాల్గొన్న వారిని విడుదల చేయాలన్నారు. అరెస్ట్ చేసిన వారందరూ ముద్దాయిలు కాదని.. ఈ ఘటనలో ఉద్రేకంగా పాల్గొన్న వారి గురించి సీఎం దృష్టి్కి తీసుకుని వెళ్తామన్నారు. పోలీసులు తీసుకున్న విజువల్స్లో ఉన్న వారందరూ నిందితులు కాదన్నారు. ఉద్యమానికి ప్రేరణ చేసిన వారిని,వెనుక ఉన్న రాజకీయ పార్టీలను గుర్తించాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. ఆస్తులను తగలబెట్టిన వారిలో ప్రతిపక్షాల కార్యకర్తలు మాత్రమే ఉన్నారని.. సంబంధం లేని వారిని విడిపించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నామని పేర్కొన్నారు.
