SSC Exams 2023: సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్లో టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో విజయవాడలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. టెన్త్ పరీక్షల నేపథ్యంలో కీలక సూచనలు చేశారు.. ఎల్లుండి నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. పదవ తరగతి ఫలితాల నుంచే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయని.. ఆరు పేపర్లే ఉంటాయని తెలిపారు.. ఇక, ఉదయం 9.30 గంటలు దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.. కానీ, ఎవరికైనా వ్యక్తిగతంగా సరైన కారణం చెబితే పరీక్షా కేంద్రంలోకి అనుమతించే విషయాన్ని ఆలోచించనున్నట్టు వెల్లడించారు.
Read Also: KVP Ramachandra Rao: ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది..
మరోవైపు.. ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ జరుగుతోన్న సమయంలో పరీక్షా కేంద్రాల స్కూళ్లలో ఇతర తరగతులు, పనులు జరగవు అని స్పష్టం చేశారు మంత్రి బొత్స.. బయటి వారు ఎవరూ పరీక్షా కేంద్ర ప్రాంగణంలో పరీక్ష సమయంలో అడుగు పెట్టడం నిషేధమని స్పష్టం చేసిన ఆయన.. ఇప్పటికే ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామన్నారు.. ఈ ఏడాది 6,09,070 మంది విద్యార్థులు పరీక్షలు హాజరవుతారని తెలిపారు.. ఇక, 3వ తేదీ నుంచి ఒంటిపూట బడులు కూడా ప్రారంభం అవుతాయన్నారు.. పరీక్షకు హాజరు అవుతున్న విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించామని.. విద్యార్థులు బస్సులో హాల్ టికెట్ చూపించి ఉచిత ప్రయాణ సదుపాయం పొందవచ్చు అన్నారు. బస్సు రవాణా లేని చోట విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే డీఈవో ద్వారా ఆర్టీసీకి విజ్ఞప్తి చేస్తే ప్రత్యేకంగా బస్సు సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేశారు.. మరోవైపు.. హెడ్ మాస్టర్లు, టీచర్లు, సిబ్బంది ఎవరూ మొబైల్ ఫోన్లు పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదు.. ప్రైవేటు స్కూళ్ళల్లోని అటెండర్, హెల్పర్ వంటి సహాయ సిబ్బంది కూడా ప్రభుత్వ ఉద్యోగులే అయి ఉండాలని కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.
