ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా చనిపోవడం రాజకీయ వర్గాలను కలవరపరుస్తోంది. ఆయన ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ పోస్ట్ కోవిడ్ పరిణామాలే హఠాన్మరణానికి కారణంగా వైద్యవర్గాలు భావిస్తున్నాయి. దుబాయ్ టూర్ ముగించుకుని ఆదివారమే హైదరాబాద్కు వచ్చిన మంత్రి గౌతమ్రెడ్డికి సోమవారం ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో ఇంట్లో ఉన్నవారు వెంటనే అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ మంత్రి మృతి చెందారని అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన గౌతమ్ రెడ్డి ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎం జగన్కు అత్యంత సన్నిహిత, నమ్మకమైన నేతల్లో గౌతమ్రెడ్డి ఒకరు. ఆ విశ్వాసంతోనే కీలకమైన పరిశ్రమలు, ఐటీ శాఖల బాధ్యతలను ఆయనకు సీఎం జగన్ అప్పగించారు. ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు దుబాయ్లో జరిగిన ఎక్స్పోలో పాల్గొన్న మంత్రి గౌతమ్రెడ్డి ఈ వివరాలు వెల్లడించేందుకు మంగళవారం సీఎం జగన్ను కలవాల్సి ఉంది.