టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి.. ఎక్కడ ఏం చేస్తే.. ఎవరి ఉచ్చులో చిక్కుకుంటామో తెలియని పరిస్థితి దాపురించింది.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా డిజిటల్ పేమెంట్స్ జరగుతున్నాయి.. అవే, కొందరి కొంప ముంచుతున్నాయి… తాజాగా, ఓ వ్యక్తి 35 వేల రూపాయలు పెట్టి ఏసీ కొనుగోలు చేయడమే ఆయన చేసిన పాపం అయ్యింది.. ఆ తర్వాత సదరు బాధితుడి ఖాతా నుంచి దఫదఫాలుగా 27 లక్షల రూపాయాలు మాయం అయ్యాయి… సైబర్ నేరగాళ్లు చేతివాటం చూపించిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఎన్.ఆర్పి అగ్రహారానికి చెందిన చిగురుపల్లి నాగేశ్వర రావు.. హైదరాబాద్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేసి రిటైర్ అయిన నాగేశ్వరరావు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 37 లక్షల రూపాయలను.. ఉండిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో డిపాజిట్ చేసుకున్నారు.. అయితే, ఏప్రిల్ నెలలో రూ.35 వేలతో ఏ.సీ. కొనుగోలు చేశారు.. ఇక, ఏసీ బిగించినందుకు మరో రూ. 8 వేలు చెల్లించారు.. ఈ రెండు మొత్తాలను ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేశారు నాగేశ్వరరావు.. ఇక, రెండు రోజుల క్రితం బ్యాంకుకు వెళ్లి డబ్బులు డ్రా చేద్దాం అనుకున్న ఆయన.. తన ఖాతాలోని సొమ్మును ఓసారి చెక్ చేసుకున్నారు.. ఆయన బ్యాంకు ఖాతా లో కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే ఉండడంతో షాక్ తిన్నారు.. దీంతో.. తన బ్యాంకు ఖాతా నుంచి సొమ్ము మాయం అయిన విషయాన్నిఆలస్యంగా గుర్తించిన నాగేశ్వరరావు.. ఉండి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.