Site icon NTV Telugu

Sangameswara Temple: బయటపడ్డ సంగమేశ్వర ఆలయం.. ఆలయ చరిత్ర ఇదిగో..!

Sangameswara Temple

Sangameswara Temple

Sangameswara Temple: కృష్ణమ్మ వడిలో సంగమేశ్వరం ఓలలాడుతోంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గటంతో సంగమేశ్వర క్షేత్రం బయటపడింది. కృష్ణా జలాల్లో జలకాలాడుతోందా అన్నట్టుగా ఉంది ఆ సుందర దృశ్యం. ఇంతకీ ఈ సంగమేశ్వర ఆలయం విశేషాలు ఏమిటో చూద్దామా.. ప్రపంచంలో ఏడు నదులు కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. ఏడాదిలో ఎనిమిది నెలల పాటు నీటిలో ఉంటూ కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయం ఇది.

సంగమేశ్వరానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎందరో మునులు ఇక్కడ తపస్సు చేశారు. కర్నూలు జిల్లాలో నల్లమల అటవి క్షేత్రాన్ని ఆనుకొని ఉన్న ఏడు నదుల సంగమ పవిత్ర ప్రదేశంలో ఉంది సంగమేశ్వర క్షేత్రం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో ఉన్న సంగమేశ్వరంలో.. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలుస్తాయి. ఈ నదుల్లో ‘భవనాసి’ నది మాత్రమే పురుష నది. మిగిలినవన్నీ స్త్రీ నదులు. భవనాసి నది తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే.. మిగిలిన నదులన్నీ పశ్చిమ దిక్కు నుంచి తూర్పు వైపు ప్రవహిస్తాయి. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం అష్టాదశ శక్తి పీఠం పుణ్యక్షేత్రమైన శ్రీశైలంను తాగుతూ ముందుకు సాగుతాయి. చివరికి సముద్రంలో కలిసిపోతాయి.

India vs England: ఇంగ్లాండ్‌ను ఢీకొట్టేందుకు వ్యూహాలు సిద్ధం.. అభిషేక్ ఫామ్‌పై దినేశ్ కార్తిక్ కీలక వ్యాఖ్యలు

సంగమేశ్వర ఆలయానికి చేరుకోవాలంటే కర్నూలు నుంచి ఆత్మకూరు వెళ్లి అక్కడి నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించాలి. తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమసిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకుంటారు. సంగమేశ్వర ఆలయం గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువే. కృష్ణా నదికి ఒకవైపున గల తెలంగాణలో సోమేశ్వరం మరోవైపున గల ఆంధ్రప్రదేశ్ లోని సిద్ధేశ్వరంలో ఉన్నాయి. సిద్ధేశ్వరానికి సంగమేశ్వరానికి మధ్యలో గాయత్రీ దేవి పాదముద్రలు ఉన్నాయి. విశ్వామిత్ర మహర్షి గాయత్రీ దేవి కోసం సుదీర్ఘ తపస్సు చేశాక గోమాత రూపంలో గాయత్రీ దేవి ప్రత్యక్షమైంది. ఆ సందర్భంలో రాతిపై గోమాత పాదముద్రలు పడ్డాయి.

ఇక ఈ మాప్రాంతంలో విశ్వామిత్రుడు తపస్సు చేసిన గుహ ఇప్పటికీ ఉంది. సప్తనదులు సంగమించే ప్రదేశంలో ఉన్న సంగమేశ్వర ఆలయంలో ఉన్న శివలింగం విశిష్టమైనదే కాదు.. చాలా ప్రత్యేకమైనది కూడా. ఈ ఆలయంలో శివలింగం వేపసాల లింగం. వేల సంవత్సరాల క్రితం ధర్మరాజు ప్రతిష్టించిన శివలింగం ఇది. పాండవులు అరణ్యవాసం చేస్తుండగా శ్రీకృష్ణుని సూచన మేరకు శివలింగాన్ని ప్రతిష్టించాడు ధర్మరాజు. ఏడు నదులు సంగమించే సంగమేశ్వరంలో శివుని పూజ చేయమని శ్రీకృష్ణుడు చెప్పాడు. దీంతో శివలింగం తీసుకురమ్మని భీముడిని కాశీకి పంపాడు ధర్మరాజు భీముడు ఎంతకీ రాకపోవడంతో అమృత గడియలు దాటిపోతున్నాయని అక్కడే ఉన్న వేప చెట్టును నరికి శివలింగంగా మార్చి ప్రతిష్టించి పూజలు చేశాడు. ధర్మరాజు ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన భీముడికి పట్టరాని కోపం వచ్చింది. తాను తెచ్చిన శివలింగాన్ని విసిరేశాడు. ఆ శివలింగం ఇప్పటికీ పగిల మండలం బీరవోలు వద్ద ఉంది.

Real Estate Scam: అపార్ట్మెంట్ల నిర్మాణం పేరుతో కుచ్చుటోపీ.. మరో రియల్ ఎస్టేట్ ఘరానా మోసం వెలుగులోకి!

అయితే భీముని ఆగ్రహానికి అర్థం ఉందని సముదాయించిన ధర్మరాజు.. మొదట భీమలింగానికే పూజలు చేయాలని చెప్పాడు. సంగమేశ్వరాలయంలో వేల సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఏడాదిలో ఎనిమిది నెలలు నీటిలో మునిగి ఉన్న శివలింగం రూపంలో మార్పు రాలేదు. ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యామ్ నిర్మాణంతో నీట మునిగింది. డ్యామ్ నిర్మాణం తర్వాత 23 సంవత్సరాలు నీటిలోనే ఉంది. సంగమేశ్వరాలయం అనేది ఒకటి ఉందనే విషయాన్ని కూడా అప్పట్లో మర్చిపోయారు జనం. అయితే 2003 తర్వాత శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం భారీగా పడిపోయింది. దీంతో ఆలయం నీటి నుంచి బయటపడింది. అప్పటి నుంచి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి.

ఇప్పటికీ ఏడాదిలో ఎనిమిది నెలల పాటు అంటే జూలై నుంచి మార్చి ఆరంభం వరకు నీటిలోనే ఉంటుంది. సంగమేశ్వర ఆలయం. సంగమేశ్వరం మునులు తపస్సు చేసిన పవిత్రమైన స్థలం అగస్త్య మహాముని విశ్వామిత్రుడు ఇక్కడ తపస్సు చేశారు. స్కంద పురాణంలో సంగమేశ్వరం ప్రాధాన్యత వివరంగా ఉంది. అస్తికలు ఈ నదిలో కలిపిన పితృ దేవతలకు పిండతర్పణం చేసిన ముందు ఏడు జన్మలు తర్వాత ఏడు జన్మల్లో పాపాలు హరిస్తాయట.

Rajahmundry Adulterated Milk: కల్తీ పాల ఘటన.. రోజురోజుకి పెరుగుతున్న మరణాలు!

సంగమేశ్వరంలో స్నానం చేసిన వారికి 1000 రెట్ల ఫలం లభిస్తుందట. సర్వ పాపాలు హరిస్తాయట. సంగమేశ్వర క్షేత్రంలో గాయత్రీదేవి పాదముద్రలు మరింతగా భక్తులను ఆకర్షిస్తున్నాయి. గాయత్రీదేవి పాదముద్రల వద్ద సంధ్యావేళ గాయత్రీ మంత్రం జపిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని వేద పండితులు చెబుతున్నారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గుముఖం పడుతూ ఉండడంతో సప్తనదుల సంగమేశ్వరాలయం శిఖరం దర్శనం ఇస్తోంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 859 అడుగులు ఉండడంతో ఆలయ శిఖరం దర్శనం ఇస్తోంది. ఆలయం పూర్తిగా బయటపడాలంటే 837 అడుగులకు నీటిమట్టం చేరాలి. ఇంకా సుమారు 19 అడుగుల నీరు తగ్గాలి. ప్రస్తుతం రోజుకు సుమారు ఒక అడుగు చొప్పున నీటిమట్టం తగ్గుతోంది. మరి కొద్ది రోజుల్లోనే సంగమేశ్వర ఆలయం బయటపడి భక్తులు సంగమేశ్వరుడిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది.

Exit mobile version