Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు

Tg Bharath

Tg Bharath

Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. అయితే, ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి టీజీ భరత్.. అడ్వకేట్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా కలిసి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుందని సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు.

న్యాయపరమైన ప్రక్రియ ప్రకారం బెంచ్ ఏర్పాటు
హైకోర్టు బెంచ్ ఏర్పాటు న్యాయపరమైన ప్రక్రియకు అనుగుణంగా జరగాల్సి ఉంటుందని టీజీ భరత్ తెలిపారు. మంత్రి నారా లోకేష్ కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై స్పష్టత ఇచ్చారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో హామీ ఇచ్చినప్పటికీ అది అమలు కాలేదని విమర్శించారు. అడ్వకేట్లు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, ఓపికగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఈ అంశంపై కట్టుబడి ఉందని, న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత బెంచ్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు.

ప్రజల నుంచి ప్రభుత్వానికి వంద మార్కులు
కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని టీజీ భరత్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వానికి ప్రజలు 100 మార్కులు ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలను నేరుగా కలిసి ప్రభుత్వ పనితీరుపై ఫీడ్‌బ్యాక్ తీసుకున్నామని తెలిపారు. చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. అర్హత ఉన్న కొత్త లబ్ధిదారులకు త్వరలో పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని మంత్రి వెల్లడించారు.

కర్నూలు నగర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
కర్నూలు నగరంలో డ్రైనేజీ, విద్యుత్, రోడ్లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని టీజీ భరత్ తెలిపారు. వార్డు, క్లస్టర్, బూత్ స్థాయి కూటమి నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

చిన్న మట్టి విగ్రహాలతో వినాయక చవితి జరుపుకోవాలి
కర్నూలులో ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నీటి లభ్యత తక్కువగా ఉందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో వినాయక చవితి వేడుకల్లో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. పెద్ద విగ్రహాలకు బదులుగా చిన్న పరిమాణంలో మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అందరూ కలిసి చిన్న మట్టి విగ్రహాలతో వేడుకలు నిర్వహించాలని, వీటి నిమజ్జనం వల్ల నీటి వినియోగం తగ్గుతుందని వివరించారు. అవసరమైతే ఇంటి వద్దే మట్టి విగ్రహాలను నిమజ్జనం చేసుకోవచ్చని మంత్రి సూచించారు. ప్రస్తుతం తాగునీటికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని టీజీ భరత్ విజ్ఞప్తి చేశారు.