Site icon NTV Telugu

Devaragattu Bunny Festival: నేడు దేవరగట్టు కర్రల సమరం.. అసలు ఏంటి దాని ప్రత్యేకత..?

Devaragattu Bunny Festival

Devaragattu Bunny Festival

విజయదశమి వచ్చిందంటే చాలు.. అంతా జోష్‌లోకి వెళ్తారు.. అయితే, కర్నూలు జిల్లా దేవరగట్టులో మాత్రం.. కర్రల సమరం ప్రత్యేకంగా నిలుస్తోంది.. ఈ సారి పోలీసులు భారీగా మోహరించారు. మాలమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం, బన్నీ ఉత్సవానికి 800 మంది పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. హళగొంద మండలం దేవరగట్టు కొండ ప్రాంతంలో స్వయంబుగా వెలిసిన మాళ మల్లేశ్వర స్వామి దేవాలయంలో విజయదశమి రోజు ఆర్ధరాత్రి జరిగే బన్నీ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు 100 నైట్ విజన్ సీసీ కెమెరాలు, 700 ఎల్ఈడీ లైట్లు అమర్చారు. 10 డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టనున్నారు.. 10 చెక్‌ పోస్టులు, వీడియో కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఇక, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు పోలీసులు..

అయితే, మాల మల్లేశ్వర కళ్యాణోత్సవం అనంతరం జరిగే కర్రల సమరం ఎంతో చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. త్రేతాయుగంలో మని, మల్లాసూరులు అనే రాక్షసులను కాల భైరవుడి అవతారంలో శివుడు అంతమొందిస్తాడు. రాక్షసులు ప్రాణాలు విడిచే సమయంలో తమకు ప్రతి ఏటా భక్తుల రక్తాన్ని ఓ కుండ నిండా సమర్పించాలని కోరుకున్నారట. అందుకు శివపార్వతులు అంగీకరించారని స్థలపురాణం చెబుతోంది. పిడికెడు రక్తం ఇచ్చేందుకు ఏటా రక్ష పడి వద్దకు వచ్చే భక్తులను గోరవయ్యాలు అడ్డుకునేయత్నం చేస్తారని ప్రతీతి. ఆ సమయంలో మాళమ్మ విగ్రహాన్ని తీసుకుని పూజారి దబనంతో తొడ నుంచి పిడికెడు రక్తం సమర్పిస్తారు. వెంటనే డిర్రు గో పరక్‌ అంటూ కేకలు వేస్తూ జరిగే బన్నీ జైత్రయాత్రలో కర్రలతో కొట్టుకుంటారు. దీంతో తలలు పగిలి రక్తం చిమ్ముతుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

8 వందల అడుగుల ఎత్తులో కొలువుదీరిన పార్వతీ పరమేశ్వరులను దర్శించుకునేందుకు అర్థరాత్రి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట, ఎల్లార్తి గ్రామాల ప్రజలు పాల బాస చేస్తారు. ఘర్షణలు లేకుండా కలసికట్టుగా ఉత్సవాలను విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున కర్రలు ,అగ్ని కాగడాలు చేత బూని శివ, పార్వతుల కల్యాణం జరిపిస్తారు. కల్యాణోత్సవం ముగిశాక ఉత్సవ మూర్తులను పల్లకిలో సింహాసనం కట్ట వద్దకు చేరుస్తారు. అప్పుడే కర్రల సమరం హోరాహోరీగా జరుగుతుంది. ఉత్సవ మూర్తులు తమ గ్రామనికే దక్కాలంటూ మూడు గ్రామాల భక్తులు కర్రలతో శబ్దం చేస్తూ పోటీ పడడంతో తలలు పగుల్తాయి. వెంటనే బండారు పూసుకుని అలాగే బన్నీ ఉత్సవంలో పాల్గొంటారు. గ్రామస్తులు దీనిని ఓ క్రీడగా భావిస్తున్నా కర్రల సమరం మాత్రం భీకరంగా జరుగుతుంది.

బన్నీ ఉత్సవానికి ముందు వచ్చిన అమావాస్య నుంచి భక్తులు దీక్ష చేపట్టి ఉత్సవాలు ముగిసేంతవరకు చాలా నిష్టతో ఉంటారు. కొండపై నుంచి విగ్రహాలు తిరిగి గ్రామానికి చేరేంతవరకు మద్యం, మాంసం ముట్టరు. దాంపత్య జీవితానికి దూరంగా ఉంటారు. 7 గ్రామాల ప్రజలు ఈ కట్టబాట్లు పాటిస్తారు. అయితే ఇతర గ్రామాల నుంచి కొంతమంది మద్యం సేవించి కర్రల సమరంలో పాల్గొంటుడడంతో హింసాత్మక ఘటనలు ఏటా చోటుచేసుకుంటున్నాయి. వందల మంది తలలు పగులుతున్నాయి. అయినా సరే కర్రల సమరం వీడట్లేదు స్థానికులు. ప్రతీ ఏటా బన్నీ ఉత్సవంలో పదుల సంఖ్యలో గాయపడుతున్నారు. కొందరైతే ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అయినా ఆచారం పేరుతో సాగే నెత్తుటి కాండకు ఎవరూ అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఈసారి కూడా దాదాపు రెండు లక్షల మందికి పైగా తరలివస్తారని అంచనా వేస్తున్నారు.

Exit mobile version