Tungabhadra Dam: ఉధృతంగా తుంగభద్ర.. మంత్రాలయం దగ్గర హెచ్చరికలు

  • ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉధృతంగా తుంగభద్ర..
  • 20 గేట్లను ఎత్తివేసిన అధికారులు..
  • మంత్రాలయం దగ్గర హెచ్చరికలు జారీ..
Tungabhadra

Tungabhadra

Tungabhadra Dam: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది… దీంతో పెద్ద ఎత్తున వచ్చి ఇన్‌ఫ్లో రూపంలో తుంగభద్ర డ్యామ్‌లోకి వచ్చి చేరుతుంది.. అధిక ప్రమాణంలో జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రస్తుతం జలాశయానికి 30వేల క్యూసెక్కులకుపైగా నీరు వచ్చి చేరుతుండగా జలాశయం భద్రత దృష్ట్యా 80 టీఎంసీల సామర్థ్యం దాటగానే వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. జలాశయం నుంచి 20 క్రస్ట్‌గేట్లను ఒక్కొక్కటి 2.5 అడుగుల మేర ఎత్తి 58,260 క్యూ సెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయంలో వరద నీరు పెరిగేకొద్దీ మరిన్ని గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు..

Read Also: Banakacherla Project: బనకచర్లపై కేంద్ర అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు

ఇక, తుంగభద్ర డ్యామ్‌ నుంచి నీటి విడుదలతో కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద తుంగభద్ర నది ఉగ్రరూపం దాల్చింది. తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలకు వెళ్లే భక్తులకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తీర ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ రామంజులు, ఎస్ఐ శివాంజల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.