Kodali Nani: కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని కొడాలి నాని ఆరోపించారు. డీఎస్సీ స్పోర్ట్స్ 3 శాతం కోటాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన అన్నారు. అర్హతలు, సంబంధిత సర్టిఫికెట్లు లేకపోయినా, పరీక్ష రాయకపోయినా కొందరికి ఉద్యోగాలు కల్పించారని ఆరోపించారు. లోకేష్ నాయకత్వంలో నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని విమర్శించారు.
ఆటలు ఆడని వారికి కూడా స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు ఇచ్చారని, ఉద్యోగం వచ్చిన తర్వాత బీఈడీ పూర్తి చేసే అవకాశం కల్పించడం కూడా నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు కొడాలి నాని.. ఎమ్మెల్యేను ముందుగా నియమించి ఐదేళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహించినట్లుగా ఈ డీఎస్సీ ప్రక్రియ సాగిందని ఎద్దేవా చేశారు. పంజాబ్లో టీచర్ పోస్టుల విక్రయాల కేసును ప్రస్తావిస్తూ, అక్కడ జరిగిన ఘటనల కంటే ఏపీలో మరింత పెద్ద స్థాయిలో అక్రమాలు జరిగాయని కొడాలి నాని ఆరోపించారు. డీఎస్సీ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ప్రకటించారు.
అక్రమాలను ప్రశ్నిస్తే తమ పార్టీని, వైఎస్ జగన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని అన్నారు కొడాలి. బీహార్ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ, ప్రజల తీర్పు స్పష్టంగా కనిపిస్తోందని, ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితులే ఎదురవుతాయని వ్యాఖ్యానించారు. నీట్ పేపర్ లీకేజ్ అంశాన్ని ప్రస్తావించిన కొడాలి నాని.. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ జరిగిన ఉద్యమాలను తొలుత విమర్శించిన ప్రభుత్వం చివరకు వెనక్కి తగ్గిందని అన్నారు. రాష్ట్రంలోనూ అక్రమాలపై పోరాటం కొనసాగుతుందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని..

