Andhra Pradesh: ఏపీ బీజేపీలో లుకలుకలు బహిర్గతం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ చీఫ్ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో ఏం జరుగుతుందో కూడా తమకు తెలియడం లేదని కన్నా వ్యాఖ్యానించారు. ఏపీలో పార్టీ బలోపేతానికి హైకమాండ్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమస్య అంతా సోము వీర్రాజుతోనే వచ్చిందని.. పార్టీలో వ్యవహారాలన్నీ ఆయన ఒక్కడే అన్ని చూసుకోవడంతో సమస్య ఉత్పన్నమైందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: Rahul Gandhi: ఏపీకి ఒక్కటే రాజధాని.. అది అమరావతి మాత్రమే..!!
అటు ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలు ఒక తాటిపైకి వచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటాలు చేయాలని సూచించారు. ఏపీలో నియంత పాలన సాగుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో పొత్తులు ఉంటాయా ఉండవా అన్న విషయం తాను చెప్పలేనని.. అది బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందన్నారు. పవన్ కళ్యాణ్ను సమన్వయ పరచుకోవడంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
