నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి తమిళనాడుకు చెందిన నాలుగు బోట్లు అదృశ్యమైన ఘటనపై మత్స్యకార వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు , తిరుపతి జిల్లాల నుంచి సుమారు 160 గ్రామాల మత్స్యకార పెద్దలు ప్రకాశం జిల్లా పాకాలలో భారీ పంచాయితీ నిర్వహించారు. ఈ బహిరంగ విచారణలో అధికార పార్టీ ఎంపీ ప్రమేయం ఉన్నట్లు వెల్లడవ్వడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
గత 20 ఏళ్లుగా తమిళనాడు మత్స్యకారులు అక్రమంగా ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి చొరబడి మత్స్య సంపదను దోచుకెళ్తున్నారని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. తమ జీవనోపాధిని కాపాడుకునే క్రమంలో, మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పుదుచ్చేరి కారైకాల్కు చెందిన నాలుగు బోట్లను పట్టుకున్నారు. వాటిని జువ్వలదిన్నె హార్బర్లో భద్రపరిచి, వాటి రక్షణ బాధ్యతను ఇసుకపల్లె, కొత్త బంగారుపాలెం వంటి గ్రామాల పెద్దలకు అప్పగించారు. అయితే, గత నెలలో ఈ నాలుగు బోట్లు అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో అనుమానాలు మొదలయ్యాయి.
Prabhsimran Singh: టెన్షన్ వద్దు, స్వేచ్ఛగా ఆడమన్నాడు.. నా సక్సెస్కు కారణం అతడే!
మత్స్యకార కుల కట్టుబాటు ప్రకారం నిర్వహించిన విచారణలో ప్రధాన నిందితుడు తోటయ్య సంచలన విషయాన్ని బయటపెట్టాడు. రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు ప్రోద్బలంతోనే ఆ బోట్లను విడిచిపెట్టినట్లు ఆయన బహిరంగంగా ఒప్పుకున్నాడు. హార్బర్లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా పోలీస్ అధికారుల సూచనలతోనే బోట్లను పక్కకు పెట్టామని మొదట బుకాయించినా, నిలదీయడంతో అసలు విషయం బయటపడింది.
బోట్ల మాయానికి కారణమైన మత్స్యకారులకు కుల పెద్దలు 5 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించారు. అయితే, ఇసుకపల్లిపాలెం మత్స్యకారులు దీనిని తిరస్కరిస్తూ, తాము కేవలం కోటిన్నర రూపాయలు లేదా రెండు బోట్లను మాత్రమే ఇస్తామని తెగేసి చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన అంగీకారం కుదరకపోవడంతో తెల్లవారుజామున 6 గంటల వరకు సాగిన ఈ మహాసభ అర్ధాంతరంగా ముగిసింది.
Sensational Verdict: ఆంటీ అన్నారని కోర్టుకు వెళ్లిన మహిళ.. తీర్పు ఏమొచ్చిందో తెలుసా..
ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఇతర రాష్ట్రాల జాలర్లు ప్రవేశించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు తీర్మానించారు. తీరం వెంబడి నాలుగు బోట్లతో నిరంతర గస్తీ ఏర్పాటు చేయాలని, మత్స్యకార చట్టాలను మరింత కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. జువ్వలదిన్నె ఘటనపై చట్టపరమైన విచారణ జరిపించాలని కోరుతూ, తదుపరి కార్యాచరణ కోసం మరోసారి సమావేశం కానున్నట్లు పెద్ద కాపులు ప్రకటించారు.
