NTV Telugu Site icon

Pawan Kalyan: ఆడపిల్లలకు రక్షణ కరువు.. దిశ చట్టం ఎప్పటి నుంచి..?

Pawan Kalyan

Pawan Kalyan

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారం ఘటన కలకలం సృష్టిస్తోంది.. ఈ వ్యవహారంలో ప్రభుత్వం, పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు.. అయితే, విజయవాడ జీజీహెచ్ లో సామూహిక అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించటంతోపాటు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్న ఆయన.. అలాగే దిశ చట్టం ఎప్పటి నుంచి అమలవుతుందో కూడా ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు.. పోలీసులు సకాలంలో స్పందిస్తే జీజీహెచ్ ఘోరం జరిగేదా? అని ప్రశ్నించారు.. ఆడపిల్లలకు రక్షణ కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేసిన యాన.. విజయవాడలో మానసిక పరిపక్వత లేని యువతిపై అత్యాచారం దుర్మార్గం అన్నారు.. విజయవాడ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో మానసిక పరిపక్వత లేని యువతిపై ముగ్గురు దుర్మార్గులు అత్యాచారం చేసిన ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు పవన్‌ కల్యాణ్.

Read also: KTR: కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. వైఎస్‌ షర్మిల పార్టీయే ప్రధాన ప్రతిపక్షం కావొచ్చు..!

ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది ఆసుపత్రిలో పని చేస్తున్నవారే కావడం చూస్తుంటే అక్కడి నిఘా, సెక్యూరిటీ ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో అర్థం అవుతోందన్నారు జనసేనని.. తమ బిడ్డ కనిపించడం లేదని కన్నవారు నున్న పోలీసులను ఆశ్రయించి ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేసినా బాధ్యత కలిగిన అధికారుల నుంచి కనీస స్పందన లేకపోవడం దురదృష్టకరమన్న ఆయన.. సత్వరమే స్పందించి ఉంటే మానసిక పరిపక్వతలేని యువతికి 30 గంటల నిర్బంధం, ఆమెపై ఘోర అఘాయిత్యం జరిగేవా..? అని నిలదీశారు.. నిందితులను శిక్షించాలని గొంతెత్తిన జనసేన నాయకులు, ఇతర పార్టీలవారిపై కేసులు నమోదు చేయడంలో చూపిన చురుకుదనం ఒక ఆడబిడ్డ ఆచూకీ తీయడంలో చూపించాల్సిందన్నారు.. మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేసినా ఇప్పటికీ ఆ చట్టం అమలులోకి రాలేదని ఫైర్ అయిన పవన్.. ఆ చట్టం ద్వారా నిందితులను శిక్షించే పరిస్థితి లేదు కాబట్టి పోలీసులే ఆడ బిడ్డల రక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఎంతో ఆందోళన, ఆవేదనతో పోలీసులను ఆశ్రయించే తల్లితండ్రులకు భరోసా ఇచ్చేలా సత్వర స్పందన అవసరం.. రాష్ట్రంలో మహిళలపై ఆఘ్యాయిత్యాలు ఏటేటా పెరుగుతున్న వాస్తవం విస్మరించలేనిదని.. 2020తో పోల్చుకొంటే 2021లో ఈ కేసులు 25 శాతం పెరిగాయని గత డీజీపీ స్వయంగా ప్రకటించారని గుర్తుచేశారు. ఇకనైనా పాలక పక్షం- పోలీసు వ్యవస్థను తమ రాజకీయ అవసరాలు, ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపుల కోసం కాకుండా ప్రజలకు రక్షణ నిమిత్తం వినియోగించాలని విజ్ఞప్తి చేశారు జనసేనాని పవన్‌ కల్యాణ్.