USA: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ దిలీప్ కుమార్ బుంగటావుల మృతి చెందారు. ఎదురుగా వస్తున్న పికప్ ట్రక్, ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దిలీప్ది కడప జిల్లా బెట్టివారిపట్టి గ్రామం. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆయన అక్కడి కెంట్ స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓహియో రాష్ట్రంలోని మాసిడోనియా ప్రాంతంలో ఇంటర్ స్టేట్ 480 రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. దిలీప్ కుమార్ ప్రయాణిస్తున్న సెడాన్ కారును అదే సమయంలో ఎదురుగా వస్తున్న పికప్ ట్రక్ ఢీకొట్టింది. ప్రమాదం గురించి తెలుసుకున్నా ఎమర్జెన్సీ సేవల బృందం ప్రమాదస్థలికి చేరుకునేలోపే దిలీప్ మరణించారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై యూఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దిలీప్ కుమార్ మృతిని న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్ ధ్రువీకరించింది. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా సాయం అందిస్తామని ప్రకటించింది. మరోవైపు, దిలీప్ కుమార్ కుటుంబానికి సాయం చేయడానికి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నిధులు సేకరిస్తోంది. దిలీప్ తండ్రి శ్రీహరి సాధారణ రైతు. దిలీప్ కుమార్ ఇటీవలే తన మాస్టర్స్ పూర్తి చేసి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

