Ambati Rambabu Hunger Strike: గుంటూరులో తన ఇల్లు, కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబబు నిరాహార దీక్ష చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఉదయం ఆరు గంటలకు నిరాహార దీక్ష ప్రారంభించిన ఆయన.. సాయంత్రం ఆరు గంటల వరకు దీక్ష కొనసాగుతుంది ప్రకటించారు.. ఇక, అంబటి రాంబాబు దీక్షకు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, వైసీపీ నేతలు నూరి ఫాతిమా, డైమండ్ బాబు, వేమారెడ్డి తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఇల్లు, ఆఫీసుపై అత్యంత దారుణంగా దాడి జరిగిందన్నారు. కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగిందని పేర్కొన్నారు.
Read Also: Modi Cabinet: ఉ.11:30కి మోడీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
తాను చంద్రబాబు నాయుడును దూషించాననే ఆరోపణలతో అరెస్టు చేసి 18 రోజులు జైలులో ఉంచారని, అయితే తన ఇంటిపై దాడి చేసిన వారిని కనీసం 18 నిమిషాలైనా జైలుకు పంపించారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు.. తనను అరెస్టు చేసిన అనంతరం నల్లపాడు పోలీస్ స్టేషన్లో హింసించేందుకు ప్రయత్నించారని, కస్టోడియల్ టార్చర్పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. ఈ దాడి వెనుక నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టబోనని, వారిని జైలుకు పంపించే వరకు తన పోరాటం ఆగదన్నారు. గుంటూరులో ఇళ్లపై దాడులు చేసే సంస్కృతిని పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకొచ్చారని విమర్శించారు. ఇద్దరు సీఐలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
తనను భయపెట్టాలనుకుంటే అది వారి పొరపాటేనని, చట్టబద్ధంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరారు అంబటి.. ప్రాణాలకు తెగించైనా చట్టపరంగా మీ సంగతి తేలుస్తానని హెచ్చరించారు. దాడి ఘటనపై న్యాయపోరాటం, ప్రజాపోరాటం రెండూ చేస్తానని, తాను చేస్తున్నది ధర్మపోరాటమని తెలిపారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దుర్మార్గమైన పాలనకు మద్దతు ఇస్తున్నారని కూడా విమర్శించారు మాజీ మంత్రి, వైసీపీ అధినేత అంబటి రాంబాబు..
