పోలీసుల అండతో రైతులపై ప్రభుత్వం కక్షసాధిస్తోందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద మహాపాదయాత్ర చేస్తున్న రైతులపై పోలీసులు చేసిన లాఠీఛార్జ్ ఘటనపై చినరాజప్ప స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీఛార్జ్ చేయడం దారుణమన్నారు.
ప్రభుత్వం ఎంత భయపెట్టినా రాజధాని రైతుల మహాపాదయాత్ర ఆగదని ఆయన స్పష్టం చేశారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతులు ఉన్నా ఖాకీలు ఆంక్షలెందుకు పెట్టారు..? అని ప్రశ్నించారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మహాపాదయాత్ర జగన్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని, వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన అన్నారు.