Papikondalu Boat Tour: పోలవరం జిల్లాలోని పాపికొండల విహారయాత్ర నేటి నుంచి తిరిగి ప్రారంభమైంది. గత 18 రోజులుగా నిలిచిపోయిన బోటు యాత్రలకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు. ఇటీవల రంపచోడవరం ఆర్డీవో, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బోట్లను ప్రత్యక్షంగా తనిఖీ చేయగా, అనంతరం రెవెన్యూ, పర్యాటకం, జలవనరులు, పోలీసులు, రవాణా తదితర ఐదు శాఖల అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ బోట్ల భద్రతా ప్రమాణాలను పరిశీలించింది.
గోదావరిలో ప్రయాణించే ప్రతి బోటు పూర్తిస్థాయి ఫిట్నెస్తో ఉండాలని, లైఫ్ జాకెట్లు, భద్రతా పరికరాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్వాహకులకు స్పష్టం చేశారు. పర్యాటకుల భద్రతకే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. అన్ని భద్రతా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉండటంతో దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రను తిరిగి ప్రారంభించారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గడంతో నేడు కేవలం రెండు బోట్లలో మాత్రమే పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన భద్రతా చర్యలు కొనసాగిస్తామని టూరిజం శాఖ అధికారులు తెలిపారు.

