పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. అయితే.. ఒక్కసారిగా ఏనుగుల గుంపు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి సుంకి రోడ్డుపై ఉదయాన్నే రోడ్డు దాటుతున్న గజరాజులు వాహనదారులకు ఉత్కంఠను కలిగించాయి.
ఏనుగుల గుంపు రోడ్డు దాటుతున్న సమయంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం రద్దీగా ఉన్న సమయంలో ఏనుగుల గుంపు నెమ్మదిగా రోడ్డు దాటడంతో రోడ్డుకు రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో కొంతసేపు వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అప్రమత్తమైన అటవీ శాఖ ఎలిఫెంట్ ట్రాకర్లు వాహనాలను నిలిపివేసి, ఏనుగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ను నియంత్రించారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన అనంతరం వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
అయితే..ఇలాంటి సందర్భాల్లోనే వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా అడవులకు సమీపంలోని రహదారులపై ప్రయాణించే సమయంలో మరింత జాగ్రత్తలు పాటించాలన్నారు.