CPM State Secretary V. Srinivasa Rao made Comments on Jaggareddygudem mystery deaths.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకుంటున్న మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్నాయి. రాత్రికిరాత్రే తమ వారు విగతజీవులుగా మారుతున్నారని జంగారెడ్డిగూడెం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే మంత్రి పేర్ని నాని, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సమీక్షించారు. అంతేకాకుండా అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ కాపుసారా త్రాగి 18 మంది మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలన్నారు.
అక్కడ జరిగినవన్నీ సహజ మరణాలని స్థానిక మంత్రి అంటున్నారని, మృతదేహాలకు పోస్ట్ మార్టం కూడా చేయకుండా ముందే మంత్రి ఎలా ప్రకటిస్తారని ఆయన విమర్శించారు. ఏ కారణం లేకుండా ఒకేసారి 18 మంది ఎందుకు మరణించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో విపరీతంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, చిన్న చిన్న పట్టణాలకు కూడా డ్రగ్స్ కల్చర్ విస్తరిస్తోందని ఆయన ఆరోపించారు.