టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఆకస్మిక మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. బొజ్జల మృతికి సంతాపం తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఓమంచి సహచరుడిని , ఆత్మీయుడిని కోల్పోయానంటూ సదరు ప్రకటనలో పేర్కొన్నారు. బొజ్జల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు కేసీఆర్ కూడా టీడీపీలో కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలతో కేసీఆర్ అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. అలాంటి నేతల్లో బొజ్జల కూడా ఒకరు. ఈ కారణంగానే బొజ్జల మృతి వార్త తెలిసిన వెంటనే అత్యంత ఆత్మీయుడిని కోల్పోయానంటూ కేసీఆర్ సంతాపం ప్రకటించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం సమయంలో టీడీపీ తరఫున కేసీఆర్ని బుజ్జగించారు బొజ్జల.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి వయసు 73 సంవత్సరాలు. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవలే హైదరాబాద్లోని బొజ్జల నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
Breaking News: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత
