NTV Telugu Site icon

AP CM: పెన్షన్దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ..

Ap Cm

Ap Cm

AP CM: రాష్ట్రంలోని పెన్షన్ దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చటమే కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం.. అందరి మద్దతుతో అండగా నిలుస్తూ.. సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది.. ఏ ఆశలు, ఆకాంక్షలతో ప్రజలు ఓట్లేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ, ప్రథమ కర్తవ్యం.. మేనిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్ను ఒకేసారి రూ. 1000 పెంచాం.. ఇకపై రూ.4000 ఇస్తామని ఆయన పేర్కొన్నారు. దివ్యాంగులకు రూ.3000 పెంచాం.. ఇకపై వారికి రూ.6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది.. 28 వర్గాలకు చెందిన 65, 18, 496 మంది పెన్షన్ లబ్దిదారులకు జూలై 1వ తేదీ నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దనే అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Read Also: Congress: కొలిక్కిరాని పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ.. మరోసారి హస్తినకు..

ఇక, కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నా.. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. పెన్షన్లు పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ. 819 కోట్ల భారం పడుతున్నా.. ప్రజా శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తెచ్చామన్నారు. ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం నాటి అధికార పక్షం పెన్షన్ విషయంలో వృద్ధులను ఎంతో క్షోభ పెట్టింది.. ఆ మూడు నెలల పాటు పెన్షన్ అందుకోవడానికి పడిన కష్టాలు చూసి చలించిపోయా.. మండుటెండలో, వడగాడ్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూసి.. ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తానని మాటిచ్చాను అని చంద్రబాబు నాయుడు తెలిపారు.

Read Also: Delhi Rains : ఢిల్లీలో కుండపోత వాన.. ఎయిమ్స్‌లో మూడపడిన ఆపరేషన్ థియేటర్లు

అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా ఈ పెంపును వర్తింప చేసి మీకు అందిస్తున్నాము అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. మూడు నెలలకు పెంచిన రూ.3000, జూలై నెల పింఛన్ రూ.4000 కలిపి మొత్తం రూ.7000 మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నాం.. సంక్షేమ పాలకుడు, సామాజిక పెన్షన్ విధానానికి ఆద్యుడు స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పింఛన్ల కార్యక్రమానికి పెట్టామని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై మీ ఇంటి వద్ద సామాజిక పెన్షన్ల పంపిణీ జరుగుతుంది.. పెరిగిన పింఛనుతో మీకు ఆర్థిక స్వావలంబన, భరోసా లభిస్తుందని ఆశిస్తున్నాం.. ప్రజా భద్రత మా బాధ్యత.. ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా.. ఎప్పుడూ మంచి చేయాలని చూసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని సీఎం చంద్రబాబు కోరారు.