Nara Bhuvaneswari Emotional: చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. యామగానపల్లి ధర్మరాజుల స్వామి ఆలయంలో ద్రౌపది అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన ఆమె, ఇది ఎన్నికల ప్రచారం కాదని, మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో తన మనసులోని మాటను చెబుతున్నానని పేర్కొన్నారు. స్త్రీ అమ్మలాంటిది అది మగవారికి గుర్తుకు తేవడానికి చేబుతున్నాను.. మహాభారతంలో కౌరవులు భర్తను అవమానించాలనే ఉద్దేశంతో ద్రౌపది అమ్మవారి వస్త్రాపహరణంకు పాల్పడ్డారని గుర్తు చేశారు. భర్తను దెబ్బతీయడానికి మహిళలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని హితవు పలికారు.. గతంలో అసెంబ్లీలో చంద్రబాబును రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు తన పేరును లాగారని, తనపై కూడా లేనిపోని వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
“నేను ఎలాంటి వ్యక్తినో నా భర్తకు తెలుసు.. ప్రజలకు కూడా తెలుసు. నేను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు” అని భువనేశ్వరి స్పష్టం చేశారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడే హక్కు ఎవరికీ లేదని, ధైర్యం ఉంటే నేరుగా రాజకీయంగా ఎదుర్కోవాలని, మహిళలను వివాదాల్లోకి లాగడం తగదని అన్నారు. ఇక, చంద్రబాబు నాయుడు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్న ఆమె, గత ఎన్నికల్లో ప్రజల రూపంలో దేవుడే తమకు అండగా నిలిచారని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.. మహాభారతంలో ద్రౌపదికి శ్రీకృష్ణుడు అండగా నిలిచినట్లే, తమ కుటుంబానికి ప్రజలు అండగా నిలిచారని, ఆ మద్దతును జీవితాంతం మరచిపోలేనని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.

