MLA Jagan: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ ఇటీవల చేసిన “చిత్తూరు వాళ్లు బెంగళూరు, చెన్నైలలో ఏలుతున్నారు” అనే వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందించారు. తన వ్యాఖ్యలతో ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నట్లయితే క్షమాపణ కోరుతున్నట్లు ప్రకటించారు. తాను చేసిన వ్యాఖ్యల ఉద్దేశం తెలుగు ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిభ చాటుతూ విజయవంతంగా రాణిస్తున్నారనే విషయాన్ని చెప్పడమేనని గురజాల జగన్ స్పష్టం చేశారు. ఇతర భాషలను లేదా ఇతర రాష్ట్రాలను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని తెలిపారు.
బెంగళూరు, చిత్తూరులోని తన రాజకీయ ప్రత్యర్థులు తన వ్యాఖ్యలను వక్రీకరించి అనవసర వివాదం సృష్టించారని ఆరోపించారు జగన్… తాను చిత్తూరు నుంచి బెంగళూరుకు వెళ్లి వ్యాపారంలో ఎదిగానని, అందువల్ల బెంగళూరు నగరంపై, కన్నడిగులపై తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని ఎవరైనా బాధపడితే వారికి మరోసారి క్షమాపణలు తెలియజేస్తున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ఆయన వ్యాఖ్యలపై కొనసాగుతున్న రాజకీయ వివాదం కొత్త మలుపు తిరిగింది.
కాగా, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్ చేసిన “బెంగళూరును ఏలుతున్నాం” అనే వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ కన్నడ సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై బెంగళూరులో ఫిర్యాదు నమోదై, ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్లు సమాచారం వెలువడడంతో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా కన్నడ సంఘాల నాయకులు ఎమ్మెల్యేపై పలు ఆరోపణలు చేశారు. వైట్ఫీల్డ్లో రియల్ ఎస్టేట్ పేరుతో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, బెంగళూరులో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. చిత్తూరుకు సంబంధించిన రాజకీయాలను అక్కడికే పరిమితం చేసుకోవాలని, బెంగళూరుపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సహించబోమని హెచ్చరించారు. కన్నడ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఎమ్మెల్యే అయినా చట్టం ముందు అందరూ సమానమేనని సంఘాల నేతలు స్పష్టం చేశారు. గురుజాల జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. అయితే, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ ఇప్పుడు క్షమాపణలు చెప్పడంతో.. వివాదం సద్దుమణుగుతుందేమో చూడాలి..

