నవమాసాలు మోసి కన్న బిడ్డను తమ అవసరాలకు అమ్మేస్తున్న ఘటనలు ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. పసిబిడ్డ విక్రయ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అశ్వారావుపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మార్చి 3 వ తేదీన ప్రసవించిన పసిబిడ్డను విక్రయించాడో తండ్రి.
ఏపీ కి చెందిన చింతలపూడి మండలం అల్లిపల్లి గ్రామానికి చెందిన చిలకమ్మ అనే మహిళ ఓ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి ప్రసవించిన మత్తులో ఉండగానే భర్త అరుణ్ కుమార్,అత్త ఘంటా మేరీ కలిసి శిశువును విశాఖకు చెందిన ఓ వ్యక్తికి 2 లక్షలకు అమ్మేశారు. చింతలపూడి మండలానికి చెందిన ఆర్ఎంపీలు బుచ్చిబాబు, శ్రీనివాస్, అశ్వారావుపేటకు చెందిన ప్రశాంతి అనే మహిళ సహకారంతో శిశువు విక్రయం జరిగినట్టు తెలుస్తోంది. చింతలపూడికి చెందిన అంగన్ వాడీ టీచర్ సమాచారంతో, అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు చింతలపూడి శిశు సంక్షేమ శాఖ అధికారులు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ అరుణ తెలిపారు.