NTV Telugu Site icon

Chandrababu: వివేకా హత్య కేసుపై వ్యంగ్యాస్త్రాలు

మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్‌ వివేకా హత్య కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది.. అయితే, ఈ కేసుపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.. వివేకా హత్యపై ఎన్నో నాటకాలాడి కట్టు కథలు అల్లారని మండిపడ్డ ఆయన.. నేనే అవినాష్ రెడ్డిని పిలిపించి రక్తం మరకలు తుడిపించానట అంటూ సెటైర్లు వేశారు.. వివేకాను హత్య చేసిన అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఎర్రగంగి రెడ్డి సహా చివరికి జగన్ కూడా మన మనిషేనట అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. సీబీఐని కూడా నేనే ప్రభావితం చేశానంటున్నవాళ్లు చివరికి మొగుడు పెళ్లాం కాపురం చేసుకోపోయినా నేనే కారణం అంటారేమో..? అంటూ చురకలు అంటించారు.

Read Also: Russia-Ukraine War: యుద్ధంపై రష్యా కీలక ప్రకటన

ఇక, రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల సమస్యకు, ఉద్యోగుల సమస్యలకు కూడా నేనే కారణమని అంటున్నారని మండిపడ్డారు చంద్రబాబు… ఇన్నింటిని నేనే మేనేజ్ చేయగలిగితే ఎన్నికల్లో ఎలా ఓడిపోతాను? అని ప్రశ్నించిన ఆయన.. బాబాయిని హత్య చేసిన వాడు రాజకీయాలకు అవసరమా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. శిశుపాలుడికి కూడా 100 తప్పులు చేశాకే పాపం పండినట్లు, జగన్‌కు ఇచ్చిన ఒక్క అవకాశం ఇక చివరి అవకాశమే కావాలన్నారు. మరోవైపు.. అమరావతి భూముల్ని సైతం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవాలని చూశారని ఆరోపించారు చంద్రబాబు.. ఆనాడు 3 రాజధాలనులకు వ్యతిరేకంగా శాసనమండలిలో తెలుగుదేశం ఎమ్మెల్సీలు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్న ఆయన.. ఎన్ని బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేసినా న్యాయం కోసం ఎమ్మెల్సీలు బిల్లును అడ్డుకున్నారన్నారు.. ఆనాడు మండలిలో బిల్లు ఆమోదం పొందకపోవటం కూడా కోర్టు తీర్పుకు సులభతరమైందన్నారు చంద్రబాబు.